కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దాదాపు రెండు నెలలకు పైగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.రోడ్లనే ఇళ్లగా చేసుకుని నిద్రాహారాలు మానీ అన్నదాతలు నిరసన చేస్తున్నారు.
రిపబ్లిక్ డే రోజున జరిగిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు తప్పించి.మిగిలిన కాలంలో ప్రశాంతంగానే రైతన్నలు దీక్ష సాగించారు.
రైతులకు మద్ధతుగా పలువురు దేశాధినేతలు, ప్రముఖులు మద్ధతు పలుకుతూ.భారత ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నారు.
తాజాగా పాప్ సింగ్ రిహానా, పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్లు ట్వీట్ చేయడంతో రైతు ఉద్యమం మరోసారి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది.ఇలాంటి పరిస్ధితుల్లో అమెరికా భారత్కు అండగా నిలిచింది.
వ్యవసాయ రంగంలో భారత్ తీసుకొచ్చిన సంస్కరణలకు బైడెన్ ప్రభుత్వం మద్ధతిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.భారత మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచేలా, ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించేలా ఆ దేశ ప్రభుత్వం చేపట్టే చర్యలను అమెరికా స్వాగతిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగంలో భారత తీసుకొస్తున్న సంస్కరణల వల్ల అక్కడి రైతులకు మార్కెట్ పరిధి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కానీ ఎలాంటి విభేదాలనైనా చర్చలతోనే పరిష్కరించుకోవాలని అమెరికా ప్రోత్సహిస్తుందని వెల్లడించారు
మరోవైపు రైతుల ఆందోళనకు మద్ధతుగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని సిక్కు సంతతి వారు ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొండి వైఖరిని విడనాడాలని, రైతాంగానికి వ్యతిరేకంగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలను శాశ్వతంగా రద్దు చేయాలంటూ ఖలిస్తాన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలకు చెందిన సిక్కు రైతాంగానికి ఈ మూడు వ్యవసాయ బిల్లులు శాపంలా పరిణమించాయని వారు ఆరోపించారు.
కొత్త వ్యవసాయ చట్టాల వల్ల సిక్కు సామాజిక వర్గానికి చెందిన రైతులు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.వ్యవసాయ చట్టాలను భారత ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసేంత వరకూ తమ ఉద్యమం ఆగదని ఖలిస్తాన్ ప్రతినిధులు హెచ్చరించారు.
అలాగే పలువురు చట్ట సభ సభ్యులు సైతం రైతుల ఆందోళనకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.