వరుసగా వస్తున్న తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ పైచేయి అవుతుందా లేదా అనే టెన్షన్ ఆ పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది.ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, టీఆర్ఎస్ అన్ని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు మొత్తం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు.ఇక్కడ వందకుపైగా స్థానాల్లో టిఆర్ఎస్ కు స్థానాలను తీసుకురావాలనే సంకల్పంతో కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.
ఇక దుబ్బాక ఉప ఎన్నికలపై పూర్తిగా మంత్రి హరీష్ రావు దృష్టిపెట్టారు.
ఇక్కడ టిఆర్ఎస్ కు కాస్త సానుకూలత ఉన్నా, చెరుకు శ్రీనివాస్ రెడ్డి రెబల్ గా పోటీ చేస్తారనే భయం ఆ పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది.
నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ఎస్ కు స్థానిక సంస్థల ఓటర్ల మెజారిటీ ఎక్కువగా ఉండడంతో టీఆర్ఎస్ గెలుపు ధీమాలోనే ఉంది.కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం టిఆర్ఎస్ కలవరపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ ప్రతికూల అంశాలు ఎక్కువగా ఉండడంతో టిఆర్ఎస్ కు గెలుపు కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్వయంగా కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేకత ఉందని గత కొంతకాలంగా సర్వే రిపోర్టులు కేసీఆర్.కు అందడంతోనే ఇంతగా కలవరపడుతున్నట్టుగా తెలుస్తోంది.గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి చెందింది.ఇప్పుడు అటువంటి చేదు ఫలితాలు టిఆర్ఎస్ ఖాతాలో పడకుండా కెసిఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వంటి వారు రంగంలోకి దిగుతున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందితే రానున్న రోజుల్లో ఆ ప్రభావం ఎన్నికలపైన పడుతుందని, ఇది మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా ఇక్కడ దృష్టిపెట్టి స్వయంగా ఎన్నికల పర్యవేక్షణ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మిగతా చోట్ల జరిగే ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రావు ,కవిత ఏదో రకంగా ఫలితాలు అనుకూలంగా ఉండేలా చూడగలరని కెసిఆర్ నమ్ముతున్నారు.అందుకే ఈ ఎన్నికలపై పూర్తిగా దృష్టిసారించినట్లు గా కనిపిస్తున్నారు.