వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు దేశానికి ఎన్నో రకాలుగా సేవలందిస్తున్నారు.మనదేశంలో పెట్టుబడులు పెట్టి, కంపెనీలు స్థాపించి భారతదేశ ఆర్ధిక వ్యవస్ధకు తోడ్పాటును అందిస్తున్నారు.
అలాగే సామాజిక కార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాల ద్వారా జన్మభూమికి సేవ చేస్తున్నారు.ఇక ఎన్ఆర్ఐల ద్వారా పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం మనదేశానికి అందుతోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) (Reserve Bank of India (RBI))విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.విదేశాలలో పనిచేస్తున్న భారతీయులు 2024లో రికార్డు స్థాయిలో 129.4 బిలియన్ డాలర్లను స్వదేశానికి పంపారు.అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో ఇప్పటి వరకు అత్యధికంగా 36 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అందినట్లుగా ఆర్బీఐ తెలిపింది.అంతేకాదు.2024లో అత్యధిక రెమిటెన్స్లను స్వీకరించే దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.68 బిలియన్ డాలర్లతో మెక్సికో రెండో స్థానంలో ఉంది.చైనా 48 బిలియన్లు, ఫిలిప్పీన్స్ 40 బిలియన్ డాలర్లు, పాకిస్తాన్ 33 బిలియన్ డాలర్లతో తర్వాతి స్థానంలో నిలిచాయి.

ప్రపంచ బ్యాంక్(World Bank) డేటా ప్రకారం 2023లో నమోదైన 1.2 శాతంతో పోలిస్తే 2024లో చెల్లింపుల వృద్ధి రేటు 5.8 శాతంగా అంచనా వేశారు.విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య 1990లలో 6.6 మిలియన్లుగా ఉండగా .2024 నాటికి అది 18.5 మిలియన్లకు అంటే మూడు రెట్లు పెరిగింది.అదే సమయంలో ప్రపంచంలోని వలసదారులలో భారతీయుల వాటా 4.3 శాతం నుంచి 6 శాతానికి పైగా పెరిగింది.ప్రపంచంలోని పలు దేశాలకు వలస వెళ్లిన మొత్తం భారతీయుల్లో గల్ఫ్ దేశాల్లోనే సగం మంది ఉన్నారు.

అమెరికాలో విదేశీ కార్మికుల ఉపాధి క్రమంగా కోలుకుంది.ఫిబ్రవరి 2020లో మహమ్మారికి ముందున్న స్థాయి కంటే 11 శాతం ఎక్కువగా ఉందని నివేదిక చెబుతోంది.2024 నాటికి తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు అధికారికంగా నమోదు చేయబడిన చెల్లింపులు 685 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా.జనాభా ధోరణులు, ఆదాయ అంతరాలు, వాతావరణ మార్పులు ఈ విషయంలో ప్రభావం చూపుతున్నాయని నివేదిక వెల్లడించింది.