మన సమాజంలో కొన్ని నేరాలకు సంబంధించిన దర్యాప్తులు ఏళ్లపాటు సాగుతూనే ఉంటాయి.వీటిలో పోలీసులు కొన్ని కేసుల్లో మాత్రమే నేరస్తులను గుర్తించి శిక్షలు వేయించగలుగుతారు.
మరికొన్నింటిలో మాత్రం ఆ చిక్కుముడులు చేధించడం కష్టమవుతుంది.తాజాగా అమెరికాలో ఓ భారతీయుడి హత్య కేసులో నిందితుడిని ఎఫ్బీఐ అధికారులు ఏడేళ్ల తర్వాత అరెస్ట్ చేశారు.
పంజాబ్ రాష్ట్రంలోని ఫతేఘర్ సాహిబ్ పట్టణానికి చెందిన మన్ప్రీత్ ఘుమాన్ సింగ్ కాలిఫోర్నియాలోని సౌత్ లేక్ తాహోలో ఒక గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నారు.ఈ క్రమంలో 2013 ఆగస్టు 6న మన్ప్రీత్ని ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్చి చంపాడు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఎఫ్బీఐ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.సుమారు ఏడేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి 34 ఏళ్ల సీన్ డోన్హోను ఎఫ్బీఐ అధికారులు, లాస్ వేగాస్ మెట్రోపాలిటిన్ పోలీసులతో కలిసి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం లాస్వేగాస్లో నివసిస్తున్న డోనోహో… హత్య జరిగిన సమయంలో సౌత్ లేక్ తాహో నగరంలో నివసించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.2013, ఆగస్టు 6న ముఖానికి ముసుగు ధరించిన ఓ గుర్తుతెలియని దుండగుడు యూఎస్ గ్యాసోలిన్ స్టేషన్లోకి వెళ్లి అక్కడ క్లర్క్గా పనిచేస్తున్న మన్ప్రీత్ను కాల్చిచంపాడు.ఈ హత్య కేసు దర్యాప్తును ఎల్ డొరాడ్ కౌంటీ కోల్డ్ కేస్ టాస్క్ఫోర్స్కు అప్పగించారు.2017 జూలైలో ఎల్ డొరాడో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఈ హత్యకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తద్వారా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని పోలీసులు భావించారు.
వారు ఊహించినట్లుగానే ఈ సంఘటనను చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి.పోలీసులు విడుదల చేసిన వీడియోను చూశాడు.
ఆ వెంటనే 2019 వేసవిలో దర్యాప్తు అధికారులను కలిసి నిందితుడైన డోన్హోకు సంబంధించిన వివరాలు తెలియజేశాడు.దీంతో ఈ కేసు చిక్కుముడిని పోలీసులు చేధించి, హంతకుడిని అరెస్ట్ చేయగలిగారు.