వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నట్టు గా కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం నాయకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నట్టుగా పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.ముఖ్యంగా యువ మంత్రులకు, పార్టీలో సీనియర్ నాయకులకు మధ్య విభేదాలు రోజు రోజుకి తీవ్రతరం అవుతున్నాయి.
ఇక జగన్ కూడా యువ నాయకులకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నట్లుగా వ్యవహరిస్తుండడంతో కొంతమంది నాయకులు అసంతృప్తికి గురవుతున్నారు.జగన్ క్యాబినెట్ లో చూసుకుంటే 25 మంది వరకు మంత్రులు ఉన్నారు.
వీరిలో సీనియర్లు కూడా చాలా మందే ఉన్నారు.బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు వంటి తదితరులు రాజకీయాలకు కొత్తేమీ కాదు.
అయితే యువ మంత్రులు దూసుకు వెళ్తున్నట్టు గా ఈ సీనియర్ మంత్రులు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు.
తమ శాఖలపై వీరు పూర్తిసాయిలో పట్టు సాధించలేకపోవడంతో జగన్ వీరిని లైట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఏ విషయాన్నీ అయినా యువ మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, సుచరిత, ఆదిమూలపు సురేష్ తదితరులతోనే చర్చిస్తూ వారికే జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండడం సీనియర్ మంత్రులకు రుచించడంలేదు.జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కొంత మంది వ్యక్తులకు కూడా ఇది ఆగ్రహం కలిగిస్తోంది.
అనంతపురం ఎమ్మెల్యే వెంకట రామి రెడ్డి, విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్ర స్వామి, కాపు రామచంద్రారెడ్డి వంటి వారు జగన్ కు సన్నిహితంగా ఉండేవారు.ప్రభుత్వం వచ్చాక తాము కీలకంగా మారవచ్చని వీరంతా భావించారు.
కానీ జగన్ వీరిని పెద్దగా పట్టించుకోకపోవడంతో వీరంతా గుర్రుగా ఉన్నారు.
ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అదే జిల్లాకు చెందిన యువ మంత్రి ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడం ఈ అసంతృప్తి లో భాగంగానే అన్నట్టుగా కనిపిస్తోంది.ఈ విషయాలు జగన్ వరకు వెళ్లినా సీనియర్ నాయకులను పట్టించుకునే విధంగా ఆయన వ్యవహరించడం లేదు అనే బాధ సీనియర్ నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.అయితే జగన్ యువ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వెనక రాజకీయ కారణాలు తప్పకుండా ఉంటాయని, ప్రస్తుతం తమకు రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువగా ఉండటం వలన జగన్ దూకుడు పెంచే పనిలో భాగంగానే యువ నాయకులతో విమర్శలు చేయిస్తూ ప్రభుత్వాన్నినడిపిస్తున్నట్లు కొంతమంది సమర్థిస్తున్నారు.