కరోనా మహమ్మారి ఏ దేశంలో ఎలాంటి ప్రభావం చూపిందో అందరికి తెలిసిందే, కానీ అన్ని దేశాలకంటే కూడా అమెరికాపై మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడిందనే చెప్పాలి.అగ్ర రాజ్యమని ఏ అర్హతలను అమెరికా చూపించుకుంటుందో అన్ని రంగాలపై కరోన ప్రభావం చూపిందనే చెప్పాలి.
ఆర్ధిక, ప్రాణ నష్టాలను తీవ్ర స్థాయిలో చవి చూసిన అమెరికా ప్రభుత్వం ఇప్పుడు మరో పెను సంక్షోభం దిశగా పయనిస్తోంది.కరోనా కారణంగా పలు రంగాలు మూత పడి ఆయా రంగాలలో పనిచేసే వారు ఉద్యోగాలు కోల్పోగా నిలదొక్కుకున్న సంస్థలు మాత్రం ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఏళ్ళ తరబడి ఉద్యోగాలు చేసి సంస్థలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను సంస్థ పట్టించుకొకపోవడమే కాకుండా ఉద్యోగాల నుంచీ తొలగించడం, లేదా జీతాలలో భారీగా కోతలు కోయడంతో అమెరికన్స్ అల్లాడిపోతున్నారు.దాంతో తమ అనుభవానికి తగ్గట్టుగా వచ్చే ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారు.
ఈ క్రమంలో తమని తక్కువగా చూసిన సంస్థకు ఇప్పుడు ఉద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. ది గ్రేట్ రిజిగ్నేషన్ పేరుతో పలు సంస్థలలో ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు.
ఒకటి కాదు రెండు కాదు ఇలా అమెరికా వ్యాప్తంగా నేటికి సుమారు 44 లక్షల మందికి పైగా రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.
ఆగస్టు నెల నాటికి మొత్తం 43 లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేయగా ఒక్క సెప్టెంబర్ నెలలో ఆ సంఖ్య 44 లక్షలకు చేరుకుంది.అత్యధిక జీతం అందించే సంస్థలు కోసం, మార్గాల కోసం రాజీనామా చేసే నిరుద్యోగులు వెతుకుతున్నారని అక్కడి కార్మిక శాఖ వెల్లడించింది.ప్రస్తుతం భారీగా ఉద్యోగులు రాజీనామాలు చేయడంతో నిరుద్యోగుల సంఖ్య పెరగడమే కాకుండా అమెరికా వ్యాప్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయట.త్వరలో పండుగ రోజులు రానున్న నేపధ్యంలో పలు సంస్థలు అధిక వేతనాలు ఇచ్చయినా సరే ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.