జగన్ కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులుగా ముద్రపడిన వైసిపి మాజీమంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని , గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లపునేని వంశీ మోహన్ లకు పెద్ద రాజకీయ ఇబ్బందే వచ్చిపడింది.టిడిపి అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించడంలో ఏమాత్రం మొహమాటపడరు వంశీ, నానిలు.
అందుకే జగన్ సైతం వీరిద్దరికి అంతగా ప్రాధాన్య ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు.వ్యక్తిగతంగాను చంద్రబాబు వ్యవహారంపై నాని వంశీలకు అసంతృప్తి ఉండడంతో, మరింతగా తమ విమర్శలకు పదును పెడుతూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ కావడం పై ఏపీలో టిడిపి , జనసేన, బిజెపి వంటి పార్టీలు ఈ విషయంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడుతున్నాయి.
ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ వ్యవహారంపై స్పందించారు.
జగన్ సోదరి షర్మిల సైతం పేరు మార్పును తప్పుపట్టారు.రాజకీయంగా విమర్శలు వస్తాయని తెలిసినా, జగన్ ముందడుగు వేశారు.
జగన్ నిర్ణయం పై వైసీపీ నాయకుల్లోనూ భిన్నభిప్రాయాలు ఉన్నా, జగన్ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎవరు ఏమి మాట్లాడలేని పరిస్థితి.గన్నవరం ఎమ్మెల్యే గా ఉన్న వల్లభనేని వంశీకి, గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారడంతో పాటు, రాబోయే ఎన్నికల్లోను రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి.
జగన్ తీసుకున్న నిర్ణయం పై కొడాలి నాని సైలెంట్ గానే ఉన్నా… వంశీ మాత్రం పేరు మార్పు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
జిల్లాకు ఎన్టీఆర్ పెట్టడం సమంజసమేనని , కానీ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం తగదు అంటూ వంశీ ఏపీ ప్రభుత్వానికి సూచించారు.ఎప్పుడూ జగన్ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ.ప్రత్యర్థులపై విరుచుకుపడే కొడాలి నాని ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు.
ఎన్టీఆర్ సొంత గడ్డైన నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గంలోనే ఉండడంతో నానికి రాజకీయంగాను తలనొప్పులు మొదలయ్యాయి. అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి అనేక విమర్శలు వస్తున్న క్రమంలో ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేది నాని తేల్చుకోలేకపోతున్నారు.
రాజకీయంగా రాబోయే ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాలనే ఆందోళనలో అటు వంశీ ఇటు నానీలు ఉన్నారు.