మన కుటుంబసభ్యుల్లో ఎవరైనా దూరమైతే.వారి జ్ఞాపకాలతో మనం కాలం వెళ్లదీస్తుంటాం.
ఏ శుభకార్యం వచ్చినా.ఏ చిన్న పండుగ వచ్చినా వారిని తలుచుకుంటాం.
ఎంత గుర్తుకు తెచ్చుకున్నా వారు లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.అయితే కొందరు వారి లోటును పూడ్చుకునేందుకు మైనపు విగ్రహాలు తయారు చేయిస్తూ కార్యక్రమాలను జరిపిస్తున్నారు.
తాజాగా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండడం మనం చూస్తున్నాం.తాజాగా కర్ణాటక మైసూర్లోనూ అదే జరిగింది.
దివంగతులైన తండ్రికి మైనపు విగ్రహం చేయించి ఆప్రతిమ ఎదురుగానే తాను ఇష్డపడిన యువతిని పెళ్లి చేసుకున్నాడు తనయుడు.ఈ అపూర్వ ఘట్టం మైసూరు జిల్లా నంజనగూడు పట్టణంలోని సంతాన గణపతి కల్యాణమండపంలో చోటు చేసుకుంది.
చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అజ్జంపుర గ్రామానికి చెందిన రమేష్ కరోనా సెకండ్వేవ్లో మృతి చెందారు.రమేష్ కుమారుడు యతీష్ మైసూరులో ఆయుర్వేద వైద్య కళాశాలలో ఎండీ కోర్సు పూర్తి చేశాడు.
నంజనగూడు తాలూకా మేల్కుండి గ్రామానికి చెందిన డాక్టర్ అపూర్వతో యతీష్కు ఇటీవల వివాహం నిశ్చయమైంది.అయితే నాన్నంటే ఎంతో ఇష్టం ఉన్న యతీష్… తన పెళ్లి తండ్రి సమక్షంలోనే జరగాలనుకున్నాడు.
తండ్రి ఎదుటనే వివాహం చేసుకోవాలని భావించిన యతీష్.మైనపు విగ్రహం చేయించాడు.
శనివారం విగ్రహాన్ని కల్యాణమండపానికి తీసుకొచ్చి ఆయన కళ్లెదుటే అపూర్వ మెడలో తాళి కట్టాడు.స్వయంగా తన తండ్రి పెళ్లి జరిపిస్తున్నాడని ఫీల్ అవుతూ వరుడు ఆనందపడిపోయాడు.అనంతరం తండ్రి మైనపు విగ్రహం పక్కనే ఆసనం వేసి అందులో తల్లిని కూర్చోబెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.యతీష్ తల్లి. మైనపు విగ్రహం పక్కనే కూర్చొని పెళ్లి తంతు జరిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మా నాన్న మాతో ఉన్నట్లే అనిపిస్తోంది అని యతీష్ తెలిపారు.