తమ డిమాండ్లు నెరవేర్చమంటూ ఆర్టీసీ కార్మికులు ఏకంగా 52 రోజుల పాటు సమ్మె చేశారు.ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు.
మరికొందరు తమ ఉద్యోగాలు ఏమైపోతాయన్న కలతతో గుండెపోటుతో మరణించారు.అయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు కరగలేదు.
చివరికి చేసేది లేక కార్మికులే దిగి వచ్చి సమ్మె విరమించారు.
తప్పయిపోయింది.
దయచేసి మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకోండని ప్రాధేయపడుతున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదు.సమ్మె జరిపిన కార్మికుల పరిస్థితి ఇలా ఉంటే.
పరోక్షంగా సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.పంతానికి పోయి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు శాపంగా మారింది.

అంతగా అనుభవం లేని వాళ్లను డ్రైవర్లుగా తెచ్చి పెడుతున్నారు.దీంతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టీసీ డ్రైవర్లు ఎంతో జాగ్రత్తగా బస్సులు నడుపుతుంటారు.కానీ తాత్కాలిక పద్ధతిలో వచ్చిన వాళ్లు నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రజలను బెంబెలెత్తిస్తున్నారు.తాజాగా హైదరాబాద్లో ఇలాంటి ఘటనే జరిగింది.
లారీ డ్రైవర్గా పని చేసిన శ్రీధర అనే వ్యక్తి తాత్కాలిక డ్రైవర్గా ఆర్టీసీలో చేరాడు.
చేరిన నాలుగోరోజే తన నిర్లక్ష్యపు డ్రైవింగ్లో సోహిని సక్సేనా అనే 35 ఏళ్ల ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలను బలిగొన్నాడు.హైదరాబాద్ ట్రాఫిక్లోనూ 70 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ఆ మహిళ వెళ్తున్న స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టాడు.
ఆ తర్వాత కూడా అలాగే వంద అడుగుల మేర ఆమెను లాక్కెళ్లడంతో సోహిని తల చిద్రమై అక్కడికక్కడే చనిపోయింది.

ఈ ఘటనతో కోపోద్రిక్తులైన అక్కడి వాళ్లు ఆ డ్రైవర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు.నిజానికి తాత్కాలిక డ్రైవర్లు వచ్చినప్పటి నుంచీ ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు చాలా ఎక్కువయ్యాయి.ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు పోయినా చలించని ఈ ముఖ్యమంత్రి.
కనీసం ప్రజల ప్రాణానికీ విలువ ఇవ్వకపోతే ఎలా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.