ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసులో మరోసారి కెనడా సీరియస్ యాక్షన్లోకి దిగింది.ఈ కేసులో అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మను( Indian Ambassador Sanjay Kumar Varma ) చేర్చడంతో మోడీ సర్కార్ భగ్గుమంది.
ట్రూడో చర్యల కారణంగా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారిపోతున్నాయని మండిపడింది.ఆధారాలు లేకుండా ఇలాంటి విపరీత చర్యలకు దిగడం ఏమాత్రం మంచిది కాదని చురకలు అంటించింది.
అయితే ట్రూడో సర్కార్ తీరుతో కెనడాలోని సిక్కేతర కమ్యూనిటీలు వణికిపోతున్నాయి.ముఖ్యంగా హిందువులు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఇప్పటికే కెనడాలోని పలు హిందూ ఆలయాలు, సంస్థలపై ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే.కెనడియన్ హిందువులంతా తక్షణం కెనడాను ఖాళీ చేసి వెళ్లాలని గతంలో ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్ధ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ ( Sikhs for Justice )సంస్థ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు.
తాజా ఘటనల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని కెనడాలోని హిందువులు బిక్కుబిక్కుమంటున్నారు.
ఈ పరిణామాలపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య ( MP Chandra Arya )అసహనం వ్యక్తం చేశారు.ఖలిస్తాన్ తీవ్రవాదం వల్ల హిందూ సమాజానికి పొంచి ఉన్న ముప్పుపై ఆలోచించాలని జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి ఆయన ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు.వేర్పాటువాదుల వల్ల తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని హిందువులు భయపడుతున్నారని అందులో చంద్ర తెలిపారు.
హిందూ పార్లమెంట్ సభ్యుడిగా తాను కూడా ఈ బాధ అనుభవించానని ఆయన పేర్కొన్నారు.గత వారం ఖలిస్తాన్ నిరసనకారులు తనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారని.పోలీసుల రక్షణతో ఎడ్మంటన్లో జరిగిన కార్యక్రమంలో సురక్షితంగా పాల్గొన్నానని చంద్ర ఆర్య వెల్లడించారు.
నిజ్జర్ హత్య సహా ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు చేయాలని భారత్ కెనడాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.హిందూ కెనడియన్ల భద్రతపై రాజకీయ పార్టీలు, నేతలు గళం విప్పాలని చంద్ర ఆర్య పిలుపునిచ్చారు.కెనడా పురోగతికి హిందూ కెనడియన్లు దోహదపడుతున్నారని ఆయన తెలిపారు.
వారి తరపున తాను పోరాడతానని.కానీ తన ఒంటరి ప్రయత్నం కంటే సమిష్టి పోరాటమే ఫలితాన్ని ఇస్తుందని చంద్ర ఆర్య చెప్పారు.