ఏపీలో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి ….అవి అలాంటి లాంటి వర్షాలు కాదు భారీ వర్షాలు.
కాకపోతే అది రాజకీయ నాయకులు కురిపిస్తున్న భారీ హామీల వర్షాలు.ఇప్పుడు నాయకులు హామీ ఇవ్వడం లో గతంకంటే దూకుడు ప్రదర్శిస్తున్నారు.
అన్ని రాజకీయ పార్టీ నాయకులు పోటీలు పడి మరీ అది చేస్తాం…ఇది చేస్తాం…అంటూ హామీలు గుప్పిస్తున్నారు.అయితే అది ఆచరణ సాధ్యమా కాదా.? అనే విషయం మాత్రం మర్చిపోతున్నారు.హామీ ఇచ్చినా అది సాధ్యం కాదనుకుంటే ఏదో ఒక నిబంధన పెట్టి తప్పించుకోవచ్చ్చని చూస్తున్నారు.
ప్రస్తుతం నాయకులు పైకి మాత్రం సాధారణ ప్రజలకు ఎంతో మేలు చేసేవిగా కనిపిస్తున్నాయి.కానీ వాటిని సుదీర్ఘ కాలం అమలుపరచడం భారీ ఖర్చుతో కూడుకున్నది .ఎన్నికల తంతు ముగిసే వరకు ఏదో ఒక వంకతో ప్రజల ముందుకు వెళ్తే… గెలిచాక చూద్దాం అప్పటికైతే అధికారం వస్తుంది కదా అనే ధీమా లో నాయకులు ఉన్నారు.
అసలు ఎన్నికలంటేనే వాగ్దానాలు.
రాజకీయ పార్టీలు ప్రకటించే వాగ్దానాలు పార్టీని విజయ తీరం వైపు తీసుకెళ్తాయి’.ఇప్పుడు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన కాంగ్రెస్ ఇంకా మిగిలిన పార్టీలు పోటాపోటీగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.
ప్రధానంగా వైసిపి టిడిపి మధ్య వాగ్దానాలు పోరు జరుగుతోంది.ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు జగన్ ‘నవరత్నాలు పేరుతో అనేక సంక్షేమ పథకాలను తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు.
అయితే ప్రస్తుతం టిడిపి ఆ మేనిఫెస్టో లోని కొన్ని పథకాలను కాపీ కొట్టి అమలులోకి తీసుకు వచ్చేసింది.దీంతో ఆ క్రెడిట్ మాదేనని వైసిపి వాదిస్తోంది.
ఇవన్నీ పక్కనపెడితే నాయకులు ఇస్తున్న వాగ్దానాలు అమలు చేయాలంటే… ఏపీ బడ్జెట్ సరిపోతుందా అనే సందేహం అందరిలోనూ తలెత్తుతోంది.

ఎన్నికల సందర్భంలో హామీలు ఇవ్వడంతో తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కూడా విపక్షనేత జగన్ కు ధీటుగా ముందుకు వెళ్తున్నారు.అందులోనూ ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నారు.అధికారంలో ఉన్న పార్టీ కొత్తగా హామీలు ఇవ్వడం అంత తేలికేం కాదు.ఎందుకంటే….ఈ నాలుగేళ్ళలో ఆ హామీలను ఎందుకు ప్రస్తావించలేదు… అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.
అందుకే తాను ఇవ్వబోయే హామీలను ఏకంగా అమల్లోకి తీసుకొస్తున్నారు.ఇందులో కొన్ని జగన్ ఇచ్చిన హామీలు కూడా కలిపి అమలు చేసి ఇటు ప్రజల్లో మంచి పేరు కొట్టెయ్యడంతో పాటు ప్రతిపక్షాలకు ఇవ్వడానికి ఏ హామీ లేకుండా చూసుకుంటున్నారు.