టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా( Tamannaah ) నటించిన లేటెస్ట్ సినిమా ఓదెల 2( Odela 2 ).ఈ సినిమా ఇటీవల ఏప్రిల్ 17న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు ఒక భారీ షాక్ తగిలింది.
ఈ చిత్రంలో కులం పేరుతో అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్ కు బీసీ కమిషన్ ఫిర్యాదు చేసింది.అదేవిధంగా, ఆయా సన్నివేశాలను తొలగించాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డుకు కమిషన్ సూచించింది.
ఈ నెలలో విడుదలైన ఓదెల 2 సినిమాలో ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్ 116 రూపాయలు కానుక రాయించిన విషయమై జరిగిన వాదప్రతివాదనలో పిచ్చగుంట్ల కులం పేరును అభ్యంతరకరంగా వాడినట్టు తమ దృష్టికి వచ్చిందని బీసీ కమిషన్ పేర్కొంది.శుక్రవారం పిచ్చగుంట్ల కులానికి చెందిన పి.
మల్లేష్( P.Mallesh ) అనే వ్యక్తి బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశారని తెలిపిన కమిషన్, ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగించాలని కోరినట్టు వెల్లడించింది.అయితే ఈ విషయంపై ఇది వరకే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇంతవరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు.

ఈ విషయమై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు లేఖ రాస్తూ, వెంటనే దర్యాప్తు చేసి సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, రచయిత, ఆ అభ్యంతరకర పదాలను వాడిన నటులపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ కోరింది.ఫిల్మ్ సెన్సార్ బోర్డు ఈ అభ్యంతరకర పదాలు ఉన్న చిత్రానికి, ఆ పదాలు తొలగించకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని కమిషన్ తప్పు పట్టింది.ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న ఈ చిత్రంలో ఇకపై జరిగే ప్రదర్శనలలో ఈ అభ్యంతరకర పదాలను తక్షణం తొలగించాలని కమిషన్ డిమాండ్ చేసింది.
తెలంగాణ డీజీపీకి ఈ లేఖ కాపీని పంపిస్తూ, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది.ఈ వ్యవహారంపై స్పందించిన సెన్సార్ బోర్డు అధికారి రాహుల్ గౌలీకర్, ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
.