జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో( Pahalgam Terror Attack ) 28 మంది అమాయక పర్యాటకులు మరణించడంతో భారత్ రగిలిపోతోంది.పేరు అడిగి, గుర్తింపు కార్డులు చూసి మరి దారుణంగా హతమార్చడంతో భారత్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది.
ఉగ్రవాదులను దెబ్బకు దెబ్బకు తీస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు.ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.
పాకిస్తాన్ను( Pakistan ) అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే ఆ దేశంపై దౌత్యపరంగా ఒత్తిడి పెంచిన మోడీ సర్కార్.
ఉగ్రవాదుల అంతు తేల్చేందుకు సిద్ధమవుతోంది.

పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిపై ప్రపంచ దేశాలు భారత్కు బాసటగా నిలిచాయి.భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలుస్తామని పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు స్పష్టం చేశారు.అటు భారత్లోని రాజకీయ పార్టీలు కూడా కేంద్రానికి అన్ని విధాలుగా మద్ధతు పలికాయి.
ఇప్పటికే అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.దాడి తర్వాతి నుంచి పరిస్ధితులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదులు, పాకిస్తాన్పై ఏ నిర్ణయం తీసుకుంటారోనని దేశ ప్రజలు , అంతర్జాతీయ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

మరోవైపు పహల్గామ్ ఉగ్రవాదుల దాడిపై ప్రవాస భారతీయులు( NRI’s ) భగ్గుమంటున్నారు.ఇప్పటికే లండన్లోని పాకిస్తాన్ హైకమీషన్ వద్ద భారీగా నిరసన చేపట్టింది భారతీయ కమ్యూనిటీ.తాజాగా ఇది కెనడాకు పాకింది.అక్కడి వాంకోవర్, మాంట్రియల్ సహా దేశవ్యాప్తంగా బాధితులకు నివాళులర్పించారు భారతీయులు.దీనిలో భాగంగా శనివారం ఉదయం స్థానిక రాజకీయ నాయకులు సహా 300 మందికి పైగా ప్రజలు గ్రేటర్ టొరంటో ఏరియాలోని బ్రాంప్టన్ గీతా పార్క్ వద్ద ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.ఇండో కెనడియన్ సంస్థలతో పాటు యూదులు, బలూచ్ మానవ హక్కుల కార్యకర్తలు కూడా భారతీయుల నిరసనకు మద్ధతు తెలిపారు.