తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడాలని రకరకాల కార్యాచరణలతో ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండేలా కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత కాంగ్రెస్ పార్టీ కాస్త బలపడిందని చెప్పుకోవచ్చు.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటానికి చాలా అవకాశాలు ఉన్నా నేతలు సరిగ్గా వినియోగించుకోవడం లేదని, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫ్యల్యాలపై ప్రజల్లో ఉండకుండా పార్టీలో అంతర్గత విభేదాలతో ప్రజల్లో ఉంటుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.అసలు ఏ మాత్రం బలం లేని బీజేపీ రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ తరువాత అత్యంత బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు సత్తా చాటలేకపోతోందనే కోణంలో దూతల ద్వారా రాష్ట్ర నేతల నుండి సమాచారం సేకరిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం పార్టీ పటిష్టత పై కాకుండా ఎల్లప్పుడూ వివాదాలు, కలహాలపై దృష్టి పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింతగా బలహీన పడే అవకాశంతో పాటు, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పలుచన అయ్యే పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే ఇంకా రేవంత్ రెడ్డికి సీనియర్ నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుండటంతో ఇటు రేవంత్ రెడ్డి కూడా నిస్సహాయ పరిస్థితికి వచ్చాడని, కొంత మంది రేవంత్ రెడ్డి వర్గం కాంగ్రెస్ లో చేరే ముందుగా స్వంత పార్టీ ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ లో విభిన్న వాతావరణం ఉంటుందని అప్పట్లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం చాలా మంది రేవంత్ అభిమానులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువస్తున్నారట.ఏది ఏమైనా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తుందనేది చూడాల్సి ఉంది.