తమది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని, పేదలకు ప్రయోజనాలు చేకూర్చే ప్రభుత్వమని ప్రధాని మోదీ ప్రచారం చేస్తుండగా, ఆయన కేబినెట్లోని వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ మాత్రం రైతులను చులకన చేస్తూ పార్లమెంటులో మాట్లాడారు.శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన ఈ మంత్రి దేశంలో రైతుల ఆత్మహత్యలకు సవాలక్ష కారణాలు ఉన్నాయని, వాటిల్లో కట్నాలు, ప్రేమ వ్యవహారాలు, పిల్లలు లేకపోవడం…మొదలైనవి కూడా ఉన్నాయని అన్నారు.
మంత్రి రైతులను అగౌరవపరుస్తూ మాట్లాడటంతో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయంలో వచ్చే ఇబ్బందులు, సంక్షోభమే కాకుండా ఇంకా ఆర్థికపరమైన, సామాజికపరమైన కారణాలు కూడా ఉన్నాయన్నారు.
ఎన్సిఆర్బి సమాచారం ప్రకారం కుటుంబ సమస్యలు, అనారోగ్యం, తాగుడు తదితర వ్యసనాలు, నిరుద్యోగం, ఆస్తుల గొడవలు, వృత్తిపరమైన సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, పిల్లలు కలగకపోవడం, వివాహాలు కుదరకపోవడం లేదా కుదిరినవి రద్దు కావడం, వరకట్న సమస్యలు, సమాజంలో గుర్తింపు లేకపోవడం….ఇంకా అనేక కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రిగారు చాంతాడంత జాబితా చదివారు.
మంత్రి జవాబుపై ప్రతిపక్షాలు తీవ్రంగా ఆగ్రహించాయి.మంత్రి బాధ్యతా రహితంగా మాట్లాడారని విరుచుకుపడ్డాయి.
ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.ప్రధాని మోదీ ఇప్పటికే అనేక తలనొప్పులతో కుంగిపోతుండగా వ్యవసాయ మంత్రి కొత్త వివాదం తెచ్చిపెట్టారు.
మోదీ సర్కారు రైతు వ్యతిరేకి అని ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి.మంత్రి వ్యాఖ్యలు దాన్ని బలపరిచేదిగా ఉంది.
రైతుల ఆత్మహత్యలకు తమ బాధ్యత ఏమీలేదని, వారు వ్యక్తిగతమైన బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి చెప్పినట్లయింది.