తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి టీడీపీ, కాంగ్రెసు నాయకులు జంప్ అవుతుంటే, ఏపీలో కాంగ్రెసు నాయకులు వైకాపాలోకి జంప్ అవుతున్నారు.కాంగ్రెసు నాయకులు కొందరు ముందుగా అధికార టీడీపీలోకి పోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకవేళ అక్కడ అవకాశం లేకుంటే వైకాపాలోకి పోతున్నారు.రాష్ర్ట విభజన జరిగిన కొత్తలో కాంగ్రెసు నుంచి ఎక్కువమంది భాజపాలోకి వెళ్లారు కాని ఆ తరువాత ఆ పార్టీలోకి వలసలు దాదాపుగా నిలిచిపోయాయి.
విచిత్రమేమిటంటే ఉమ్మడి రాష్ర్టంలో వైకాపాను దుమ్మెత్తిపోసిన వారు ఇప్పుడు ఆ పార్టీలోకే పోవడానికి ఆసక్తి చూపుతున్నారు.ఉమ్మడి రాష్ర్టంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరారు.
ఈయన ఒకప్పుడు జగన్ను నానా తిట్లు తిట్టారు.ఇప్పుడు ఆయన బాటలోనే అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకుడు, ఉమ్మడి రాష్ర్టంలో మంత్రిగా పనిచేసిన సాకే శైలజానాథ్ నడిచేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది.
అసలు ఆయన టీడీపీలో చేరాలనుకున్నారట.అయితే అనంతపురానికే చెందిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మరి కొందరు నాయకులు ఒప్పుకోలేదట.
దీంతో వైకాపాలోకి పోవాలని నిర్ణయించుకున్నారట.అనంతపురం జిల్లాలో శుక్రవారం జరిగిన కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు శైలజానాథ్ డుమ్మా కొట్టారు.
ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నందువల్లనే రాహుల్ పర్యటనకు రాలేదనే ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారం మీద శైలజానాథ్ ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు.
వైకాపాలో ఏం ఆశించి చేరాలనుకుంటున్నారో తెలియదు.