మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ లో( Gwalior ) దారుణం జరిగింది.ఒక చిన్న జోక్( Joke ) కాస్తా చిలికిచిలికి గాలివానలా మారి ఏకంగా పూజారి( Priest ) ప్రాణాల మీదకు తెచ్చింది.
ఏకంగా ఆరుగురు వ్యక్తులు కలిసి 52 ఏళ్ల వయసున్న మహేష్ శర్మ( Mahesh Sharma ) అనే పూజారిని నడిరోడ్డుపై దారుణంగా చితకబాదారు.
బాధితుడిని కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, కర్రలు, బెల్టులతో విచక్షణారహితంగా దాడి చేశారు.
అంతేకాదు, ఆ దుండగులు పూజారి బట్టలు కూడా చించేశారు.మార్చి 29న బాడాగావ్ (మోహనా పోలీస్ స్టేషన్ పరిధిలో) జరిగిన ఈ షాకింగ్ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

అసలు ఏం జరిగిందంటే, బాడాగావ్ లోని ఒక గుడిలో మహేష్ శర్మ పూజారిగా పనిచేస్తున్నారు.రోజులాగే మార్చి 29న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఆయన ఇంటికి వెళ్తుండగా చంద్రపాల్ ధాకడ్ అనే వ్యక్తి ఆయనను చూసి ఒక అభ్యంతరకరమైన జోక్ వేశాడు.దానికి పూజారి కూడా తిరిగి జోక్ వేసి ఊరుకున్నారు.ఆ తర్వాత పూజారి కొన్ని వస్తువులు కొనడానికి మోహనా వెళ్లారు.

రాత్రి 7:00 గంటల సమయంలో తిరిగి ఇంటికి వస్తుండగా, చంద్రపాల్, అతని సోదరుడు రామావతార్ కలిసి పూజారిని రోడ్డుపై అడ్డగించారు.ఒక్క మాట కూడా చెప్పకుండా బెల్టులు, కర్రలతో పూజారిపై దాడి చేయడం మొదలుపెట్టారు.ఇంతలో ప్రిన్స్ ధాకడ్ అనే మరో వ్యక్తి తన స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకుని వారితో జత కలిశాడు.వారంతా కలిసి పూజారిని దారుణంగా కొట్టారు.
ఈ దాడిలో పూజారి మహేష్ శర్మ చేతులు, కాళ్లు, తలకు తీవ్ర గాయాలయ్యాయి.దుండగులు కొట్టిన తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
గాయాలతోనే పూజారి మహేష్ శర్మ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, చంద్రపాల్ ధాకడ్, రామావతార్, ప్రిన్స్ ధాకడ్ తో సహా ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
మోహనా పోలీస్ స్టేషన్ ఇన్-ఛార్జ్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ, నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.