రాజకీయాలంటే వడ్డించిన విస్తరి కాదు అన్న విషయం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇంకా తెలిసొస్తున్నట్టు కనిపించడం లేదు.రాజకీయాల్లో రాణించాలంటే ప్రజా బలం తో పాటు, నిత్యం చురుగ్గా ఉంటూ, ఎప్పటికప్పుడు రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టే విధంగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచించాల్సి ఉంటుంది.
కానీ ఇవేవీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పట్టించుకోనట్టు గా కనిపిస్తున్నారు.లోకేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఆయన మంత్రిగా, ఏంఎల్సి గా బాధ్యతలు స్వీకరించారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తర్వాత లోకేష్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పారు.టిడిపి నాయకులు అంతా లోకేష్ ను ప్రసన్నం చేసుకునేందుకు క్యు కట్టేవారు.
టిడిపి బావి వారసుడిగా లోకేష్ ఆ స్థాయిలో ఆదరణ లభించేది.గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ ఘోరంగా ఓటమి చెందడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై పార్టీలోనూ, ప్రజల్లోనూ అనేక సందేహాలు నెలకొన్నాయి.
లోకేష్ ఇప్పటికీ ప్రజాక్షేత్రంలోకి రాకుండా కేవలం ట్విట్టర్ ను నమ్ముకుని మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు.ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తూ తన ఉనికిని చాటుకుంటున్నారు.
అయితే రాజకీయాల్లో ఉన్నవారు ప్రజా క్షేత్రం నుంచి బలం పెంచుకోవాలి.అది కాకుండా టిడిపి పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్న లోకేష్ వంటి వారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఫోకస్ చేసి పార్టీకి బలం చేకూర్చే విధంగా వ్యవహరిస్తూ, కార్యకర్తల్లో భరోసా నింపే విధంగా వ్యవహరించాలి.
అలా కాకుండా కేవలం ట్విట్టర్ కు మాత్రమే పరిమితం అయిపోతే రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడడం ఖాయం.
టీడీపీలో బలమైన నాయకుడిగా ఎదిగేందుకు బాటలు వేసుకోకుండా, ఇంకా తండ్రి చాటు బిడ్డ సిల్లీగా రాజకీయాలు నడిపిస్తే, అది ఆయన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతుంది.తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని లోకేష్ ఉదాహరణగా తీసుకుంటే మంచిది.కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు .పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన పట్టు సాధించారు.ఏ క్షణం అయినా ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు.
ఇక ప్రజల్లోనూ ఆయన మంచి గుర్తింపు సాధించారు.కానీ లోకేష్ మాత్రం ఇంకా ఆ విధంగా వ్యవహరించ లేకపోతున్నారు.
ఇవన్నీ ఆయన రాజకీయ భవిష్యత్తుకు అవరోధాలు గా మారే అవకాశం కనిపిస్తోంది.