తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే.పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్నా, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం మార్పు రావడంలేదు.
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గ్రూపు రాజకీయాల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.తమ రాజకీయ ప్రత్యర్థుల మీద చేయాల్సిన విమర్శలను సొంత పార్టీ నాయకుల మీద ప్రయోగిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయాన్నే తీసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు ఏ విధంగా ఉందో అర్ధం అవుతుంది.అయితే నాయకుల తీరు చాలా కాలంగా ఈ విధంగానే ఉన్నా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోంది.
ఈ వ్యవహారం రోజు రోజు కి ముదురుతుండడంతో ఇప్పుడు రంగంలోకి దిగింది.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రకంగా ఉంటున్నా మీరు ఎందుకు పట్టించుకోవడంలేదు అంటూ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
అసలు పార్టీ అధిష్టానం ఉన్నా ఎవరూ లెక్క చేయకుండా ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని, కొంతమంది సీనియర్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.పార్టీ నియమించిన రాష్ట్ర ఇన్ చార్జిపైనే బహిరంగంగా విమర్శలు చేస్తే ఇక పార్టీపై ప్రజలకు విశ్వాసం ఎలా కలుగుతుంది అంటూ సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ తెలంగాణ నాయకుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.
తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి ఖుంటియాను నియమించాలని అధిష్టానానికి సూచించింది తానేనని, అటువంటిది ఆయననే మీరు బహిరంగంగా విమర్శితున్నారు అంటే తననే మీరు విమర్శిస్తున్నారని నేను అనుకుంటాను అంటూ గులాం నబీ అజాద్ తెలంగాణ నాయకుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అసలు ఎవరిని పీసీసీ అధక్షుడిగా నియమిస్తే బాగుంటుంది అనే విషయం అధిష్టానానికి బాగా తెలుసునని, మీరు ఎవరూ ఈ విషయంలో అనవసర తలనొప్పులు తీసుకొచ్చేలా వ్యవహరించవద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
కొత్త అధ్యక్షుడిని త్వరలోనే నియమిస్తామని, అప్పటి వరకు మీరు ఎవరూ ఎటువంటి వివాదాలకు వెళ్ళవద్దు అని, కొత్త అధ్యక్షుడు ఎవరైనా మీరంతా వారి మాటే వినాలి అంటూ ఆయన సూచించినట్టు సమాచారం.రాజకీయ ప్రత్యర్థుల మీద చేయాల్సిన విమర్శలను సొంత పార్టీ నేతల మీద చేయడం ఏంటని ? అందుకే అందరికి బాగా లోకువ అవుతున్నాము అంటూ తలంటినట్టు తెలుస్తోంది.