రాజకీయంగా గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టుసాధించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు.దానికోసమే అన్నట్టుగా అధికార పార్టీ మీద తన పరిధికి మించి మరి విమర్శలు చేస్తున్నాడు.
అసలు తాను ఎంత స్థాయి వరకు విమర్శలు చేయవచ్చు అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి మరి పవన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు.వాస్తవానికి అధికార పార్టీపై ప్రతిపక్షాలు చేయాల్సిన పని అదే అయినా శృతి మించి చేస్తున్న విమర్శలు, కామెంట్లు పవన్ కల్యాణ్ పై వ్యతిరేక భావనను పెంచుతున్నాయనేది వాస్తవం.
తాత్కాలికంగా పవన్ కు ఇది మైలేజ్ తీసుకొస్తున్నట్లు కనిపిస్తున్న ఆయనకు రాజకీయంగా చాలా డ్యామేజ్ ను తీసుకొస్తోంది.పవన్ చేస్తున్న విమర్శలు చాలా వరకు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా లేకపోవడంతో పవన్ పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అసలు రాజకీయ నాయకుడు అంటే విలువలకు విశ్వసనీయతకు మారుపేరు గా ఉండాలి.నాయకుడు చెప్పే మాటకు కానీ, చేసే ఆరోపణలకు కానీ ఒక విలువ అంటూ ఉండాలి.
అలా లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తూ తాను లేవనెత్తిన అంశాన్ని మధ్యలోనే వదిలిపెట్టడం లేక యూటర్న్ తీసుకోవడం ద్వారా ప్రజల్లో పట్టు కోల్పోతారు.సరిగ్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తూ రోజు రోజుకి తన స్థాయిని తగ్గించుకున్నట్టుగా కనిపిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ స్పందించారు కామెంట్లు చేశారు.అయితే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై ప్రజల్లో సానుకూల దృక్పధం ఉంది.
ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్న టిడిపి, జనసేనలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పవన్ ఆ తరువాత మాట మార్చారు.
తాను వద్దు అనలేదని, వదలొద్దు అన్నాను అంటూ నష్ట నివారణ చర్యలకు దిగారు.దీంతో పవన్ యు టర్న్ తీసుకున్నారు అంటూ వైసిపి నాయకులు అదేపనిగా విమర్శలు చేశారు.ఇక ఇప్పుడు రాజధాని విషయంలోనూ పవన్ అదే విధమైన ట్విట్లు పెడుతున్నారు.
సామాన్య ప్రజలు ఎవరికి అందుబాటులో లేకుండా రాజధానిని మూడు భాగాలుగా విభజిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపైన పవన్ పై విమర్శలు పెరిగిపోతున్నాయి.జనాల్లో ఏ విషయం మీద సానుకూలత ఉంది ఏ విషయం మీద ఆగ్రహం ఉంది అనే విషయాలను పవన్ పరిగణలోకి తీసుకోవడం లేదు.దీంతో సొంత పార్టీ నేతల్లోనే రోజు రోజుకి నమ్మకం తగ్గిపోతోంది.
తాజాగా పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను చూస్తే వైసీపీని నమ్మి ఓటు వేసినందుకు పింఛన్ కోసం ఎదురుచూ సే వృద్ధులు భారీగా నష్టపోయారని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు.వైసీపీ ఎన్నికల హామీలో వృద్ధాప్య పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుతామని చెప్పిందని గుర్తుచేశారు.
పెన్షన్ అమలు లో వైసీపీ ప్రభుత్వం అంచెంచెలుగా మాట తప్పుతోందనాలా లేక మోసం చేస్తోందనుకోవాలా అంటూ పవన్ ట్విట్టర్ లో అనుమానం వ్యక్తం చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ను రూ.2,250 మాత్రమే చేసిందని, దీనివల్ల ప్రతి లబ్ధిదారూ నెలకు రూ.750 నష్టపోతున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.వాస్తవానికి వైసీపీ ఎన్నికల హామీలో అంచెలంచేలుగా మూడువేలకు పెంచుతామని చెప్పిన విషయాన్ని పవన్ పరిగణలోకి తీసుకోకపోవడం కొసమెరుపు.