మళ్లీ అమరావతి వ్యవహారం తెరపైకి వచ్చింది.రాజధాని అమరావతి( Amaravathi ) నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున రైతుల నుంచి భూములు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనువుగా అప్పటి టిడిపి ప్రభుత్వం వ్యవహరించిందనే విమర్శలు వైసిపి చేయడంతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవహారంపై సిఐడిని రంగంలోకి దించి పూర్తిగా దర్యాప్తు చేపట్టే ప్రయత్నం చేయగా , ఈ దర్యాప్తు ముందుకు వెళ్లకుండా కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో, దీనిపై స్టే విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడంతో, ఇప్పటి వరకు ఆ వ్యవహారం సైలెంట్ గానే ఉంది .
అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు దానిపై స్టే ఎత్తివేయడంతో, మళ్లీ అమరావతి వ్యవహారంపై సిఐడి దూకుడు ప్రదర్శిస్తుంది.ముఖ్యంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్( Lingamaneni ramesh ) చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది.

లింగమనేని రమేష్ ను వైసిపి ప్రభుత్వం టార్గెట్ చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది.ఎయిర్ కోస్టాకు చైర్మన్ గా లింగమనేని రమేష్ ఉన్నారు.అంతే కాకుండా అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్వహిస్తున్నారు.ఉండవల్లి కరకట్ట మీద ఉన్న అతిథి గృహం లింగమనేని రమేష్ దే.అందులోనే చంద్రబాబు నివాసం ఉంటున్నారు.ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ ను ఏపీ సిఐడి అధికారులు సీజ్ చేశారు.
అయితే ఇదంతా లింగమనేని రమేష్ టార్గెట్ గానే జరిగినట్లు తెలుస్తోంది.చంద్రబాబుకు మాత్రమే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడుగా లింగమనేని రమేష్ గుర్తింపు పొందారు.
అంతేకాదు జనసేన పార్టీ కార్యాలయం నిర్మాణానికి లింగమనేని రమేష్ సహకరించారనే ప్రచారం జరిగింది.అసలు టిడిపి ,జనసేన ( Jana sena )పొత్తు కుదరడానికి కారణం లింగమనేని రమేష్ అని, అందుకే ఆయనను వైసిపి టార్గెట్ చేసుకున్నట్లు విశ్వసనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అంతేకాదు అమరావతి రాజధాని వెనుక కూడా లింగమనేని రమేష్ ఉన్నారని , ఆయన సూచనతోనే చంద్రబాబు అమరావతిని రాజధానిగా నిర్ణయించారని, అక్కడ రాజధాని నిర్మాణం ప్రకటన చేయకముందే లింగమనేని రమేష్ కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలు వేలాది ఎకరాలను ముందుగానే కొనుగోలు చేశాయని, ఆ తర్వాత ఈ ప్రకటన వెలువడిందని, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పులు లింగమనేని రమేష్ కు అనుకూలంగా మార్చారని, దీంట్లో క్విడ్ ప్రో కో జరిగిందని సిఐడి అనుమానిస్తూ, ఆధారాలు సేకరిస్తుంది.అప్పటి సిఆర్డిఏ అధికారులను విచారించినప్పుడు అలైన్మెంట్ ను మార్చాలని చెప్పింది మంత్రి నారాయణ అని, లింగమనేని రమేష్ భూములు, గెస్ట్ హౌస్ లకు ఇబ్బంది కలగకుండా అలైన్మెంట్ ప్లాన్ రూపొందించారని అప్పటి అధికారులు సిఐడి విచారణలో చెప్పడంతో, దీనిపైన సిఐడి దూకుడుగా ముందుకు వెళ్తోంది.లింగమనేని రమేష్ ను ఆర్థికంగా దెబ్బకొట్టగలిగితే టిడిపి జనసేనలకే ఎక్కువ నష్టమని, వైసీపీ అభిప్రాయపడుతోందట.