తెలంగాణలో గత పదేళ్లుగా రూల్ చేసిన బిఆర్ఎస్ పార్టీ తాజా ఎన్నికలతో అధికారాన్ని కోల్పోయింది. ఇక మొన్నటి వరకు ప్రభుత్వ హోదాలో ఉన్న బిఆర్ఎస్ అధినేత కేసిఆర్.
ఇక నుంచి ప్రతిపక్ష నేతగా కనిపించనున్నారు.ఈ నేపథ్యంలో కేసిఆర్ లక్ష్యాలేంటి ? పార్టీ బలోపేతం కోసం ఆయన ఎలాంటి వ్యూహరచన చేయనున్నారు అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి.2014, 2018 ఎన్నికల్లో భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు 2023 ఎన్నికల్లో మాత్రం బిఆర్ఎస్ ను 39 స్థానాలకే పరిమితం చేశారు.ఈ నేపథ్యంలో పార్టీలో జరిగిన లోటుపట్లపై కేసిఆర్ దృష్టి సారించే అవకాశం ఉంది.
ఈ పరాభవాన్ని గుణపాఠంగా మలుచుకొని పార్టీకి తిరిగి పూర్వవైభవం తెచ్చే దిశగా కేసిఆర్ వ్యూహాలు అమలు చేసే అవకాశంఉంది.అయితే ప్రాంతీయవాదమే ప్రదాన ఎజెండాగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీని పేరు మార్చి బిఆర్ఎస్ గా నామకరణం చేయడం కూడా ఓటమికి ఓ కారణమని చెబుతున్నారు విశ్లేషకులు.
జాతీయ రాజకీయాల్లో సత్తా చాటే లక్ష్యంగా పార్టీని బిఆర్ఎస్ గా మార్చిన కేసిఆర్ కు సొంత రాష్ట్రంలోనే ఊహించని పరాభవం ఎదురుకావడంతో ఇకపై ఆయన జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తారా లేదా కేవలం తెలంగాణలోనే పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తారా ? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

అయితే జాతీయ రాజకీయాల్లో సత్తా చాటలని చూస్తున్న కేసిఆర్.ఇకపై నేషనల్ పాలిటిక్స్ పై మరింత ఫోకస్ చేసే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.ఇప్పటికే మహారాష్ట్రలో కొంత మేర బిఆర్ఎస్ ను విస్తరించిన ఆయన.మిగిలిన రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉంది.ఇక వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో కేసిఆర్ ఫోకస్ పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఉండే ఛాన్స్ ఉంది.అలాగే ఏపీలో కూడా బిఆర్ఎస్ బలోపేతంపై కేసిఆర్ దృష్టి సారించిన ఆశ్చర్యం లేదనేది రాజకీయ వాదులు చెబుతున్నా మాట.మరి కేసిఆర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.