జర్నలిస్టులు చేపట్టే స్టింగ్ ఆపరేషన్లలో కీలక విషయాలు బహిర్గతం అవుతాయి.తాజాగా టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మపై జీ న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ దేశంలో కలకలం రేపుతోంది.
ఇండియన్ క్రికెటర్లు ఫిట్ నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుంటారని ఆయన పేర్కొనడం చర్చనీయాశంగా మారింది.స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు.

చేతన్ శర్మ ఆ స్టింగ్ ఆపరేషన్లో తెలిపిన విషయాలు వివాదంగా మారాయి.ఫిట్నెస్ కోసం కొంతమంది భారతీయ క్రికెటర్లు ఇంజెక్షన్లు కూడా తీసుకుంటారని ఆయన వెల్లడించాడు.ఇదే కాకుండా భారత జట్టు ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయిందని పేర్కొన్నాడు.కొందరు రోహిత్ శర్మ వైపు, మరికొందరు విరాట్ కోహ్లి వైపు ఉన్నారని తెలిపాడు.టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు డోపింగ్ ఇంజెక్షన్లు తీసుకుంటారని పేర్కొన్నాడు.అయితే ఆ ఇంజెక్షన్లు డోప్ పరీక్షలలో పట్టుబడవని తెలిపాడు.
డోప్ పరీక్షలో ఏ ఇంజెక్షన్ అయితే పట్టుబడతారో, ఏ ఇంజక్షన్ అయితే పట్టుబడరో క్రికెటర్లకు బాగా అవగాహన ఉందన్నాడు.డోపింగ్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఏ క్రికెటర్ అయినా ఒకేసారి 4 కప్పుల కాఫీ తాగినా, పరిమితికి మించి దగ్గు సిరప్ తాగితే డోప్ టెస్టుల్లో పాజిటివ్గా తేలే ప్రమాదం ఉంది.కాబట్టి ప్రతి క్రీడాకారుడు అనారోగ్యం పాలైన సందర్భాల్లో, ఏదైనా పెయిన్ కిల్లర్ తీసుకున్నప్పుడు వారికి అవగాహన ఉండాలి.లేకుంటే డోపింగ్ టెస్టులో పాజిటివ్ గా తేలి ప్రపంచం దృష్టిలో దోషిగా మిగిలిపోతారు.2003 దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో తొలిసారి డోపింగ్ టెస్టులను నిర్వహించారు.ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ పాజిటివ్ గా తేలాడు.అయితే తాను వాడింది డ్రగ్స్ అని తెలియదని వార్న్ వాదించాడు.దీంతో ఐసీసీ కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.డోపింగ్ విషయంలో సమగ్రమైన వ్యవస్థను రూపొందించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది.
ఇప్పటి వరకు క్రికెట్ బోర్డులకు డోప్ టెస్టుల్లో పాజిటివ్ గా తేలిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టత లేదు.