ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్ ) చక్రం తిప్పారు.మంత్రిగా , పీసీసీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలను నిర్వహిస్తూ, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఉన్న పలుకుబడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ ప్రాధాన్యం కొనసాగుతున్న సమయంలోనే ఏపీ తెలంగాణ విభజన జరగడం, ఆ తరువాత క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.
దీంతో కాంగ్రెస్ కు చెందిన నాయకులు అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిపోయారు ఆ క్రమంలోనే డిఎస్ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.
రాజ్యసభ సభ్యుడు గానూ, ఆయన పదవిని పొందారు.
తర్వాత క్రమంలో కేసీఆర్ కు డిఎస్ కు మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి .ఒకరినొకరు చూసుకునేందుకు, సైతం ఇష్టపడకపోవడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.డీఎస్ టీఆర్ఎస్ లోనే ఉన్న, లేనట్టుగా వ్యవహరిస్తున్నారు.ఆయన బీజేపీలో చేరతారని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ మేరకు చొరవ తీసుకుంటారని భావించారు.అయితే అనూహ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని డీఎస్ కలవడం, కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది.
నేరుగా డిఎస్ కాంగ్రెస్ లో చేరితే ఆయన పై అనర్హత వేటు పడే అవకాశం ఉంది .దీంతో రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాది ముగిసిన తర్వాత మాత్రమే అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉంది.డి ఎస్ తో పాటు, ఆయన కుమారుడు మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు.దీంతో కాంగ్రెస్ లో ఉత్సాహం వస్తుండగా, ఈ పరిణామాలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఇబ్బందికరంగా మారాయి.
డీఎస్ బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ వైపు వెళ్తుండడం తో అరవింద్ కు అధిష్టానం దగ్గర పరపతి తగ్గిపోతుంది అనే టెన్షన్ ఆయన వర్గీయుల్లో నెలకొంది.ఏది ఏమైనా డీఎస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయన కుమారుడు అరవింద్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.