ఒకప్పటి స్టార్ క్రికెటర్ ను ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు.దీనికి కారణం అతడు మద్యం తాగి కారు నడుపుతూ రోడ్డుపై బీభత్సం సృష్టించడమే.
అతను మరెవరో కాదు సచిన్ క్లోజ్ ఫ్రెండ్, వన్డేలో ఫస్ట్ సెంచరీ సాధించిన వినోద్ కాంబ్లీ. ప్రస్తుతం ఈ మాజీ స్టార్ క్రికెటర్ ముంబైలోని బాంద్రాలోని రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తున్నాడు.
అయితే ఆదివారం నాడు అతడు బాగా మద్యం తాగి కారు నడిపాడు.ఈ క్రమంలోనే తన రెసిడెన్షియల్ సొసైటీ గేట్ ను బలంగా ఢీ కొట్టాడు.
దీంతో ఆ గేటు ధ్వంసం అయింది.
ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వినోద్ కాంబ్లీని అరెస్టు చేశారు.అనంతరం అతడిని బెయిల్ పై రిలీజ్ చేశారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.ప్రాథమిక విచారణలో అతను బాగా మద్యం సేవించి ఉండటం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.
కాంబ్లీపై ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం), 427 (నష్టం కలిగించే అల్లర్లు) కింద కేసులు నమోదు చేసినట్లు బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
లెఫ్ట్ హ్యాండెడ్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ అయిన వినోద్ 1991లో టీమ్ ఇండియా తరపున క్రికెట్ ఆటలో అరంగేట్రం చేశాడు.క్రికెట్ చరిత్రలో వన్డేలో తొలి శతకం సాధించిన ప్లేయర్ గా వినోద్ పేరుపై ఒక సెన్సేషనల్ రికార్డు కూడా ఉంది.2000 సంవత్సరం వరకు క్రికెట్ ఆటలో కొనసాగిన వినోద్ మొత్తంగా 17 టెస్టులు, 104 వన్డేలు ఆడి తన సత్తా చాటాడు.కెరీర్ మొత్తంలో 6 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేసి అనేక రికార్డులను నెలకొల్పాడు.అయితే ఇలాంటి అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన వినోద్ ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా కారు నడిపి యాక్సిడెంట్ చేశాడని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.