ఈరోజుల్లో స్కూటర్ లేదా బైక్ కొనాలంటే కొన్ని గంటల సమయం చాలు.ఎంత ప్రీమియం బైక్ అయినా ఒక్కరోజులోనే దానిని ఇంటికి తీసుకు రావచ్చు.
ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా షోరూమ్స్ ఉన్నాయి.కొన్ని దశాబ్దాల క్రితం మాత్రం మన దేశంలో ఉన్న షోరూమ్స్ చాలా తక్కువే, అలానే బైక్స్, స్కూటర్లు కూడా చాలా తక్కువ.
వీటి రేటు మాత్రం చాలా అధికంగా ఉండేది.ప్రొడక్షన్ తక్కువ, కాస్ట్ ఎక్కువ డిమాండ్ కూడా ఎక్కువ ఉండటం వల్ల వీటిని దక్కించుకోవడం మధ్యతరగతి వారికి అసాధ్యంగా అనిపించేది.
వీటి ధర అప్పట్లో ఒక ఎకరం భూమికి సమానంగా ఉండేది.
ఇటాలియన్ కంపెనీ పియోజియో తయారు చేసిన వెస్పా స్కూటర్లు అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాయి.
పాత కాలంలో ఈ స్కూటర్లు ఎలా ఉండేవో మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. బజాజ్ చేతక్ బండిలాగానే ఇది ఉండేది.మొదటగా పియోజియో ఇలాంటి స్కూటర్లనే తయారు చేసింది.ఈ స్కూటర్లు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ కావడంతో దీనిని ఇండియాలో కూడా పరిచయం చేయాలని పుణేకు చెందిన బజాజ్ ఆటో భావించింది.
అనుకున్నదే తడవుగా ఈ కంపెనీతో బజాజ్ ఆటో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.అలా తొలుత ఇటాలియన్ కంపెనీ పంపించే ఇంజన్స్ను ఇండియాలోని స్కూటర్లలో అసెంబల్ చేసేవారు.
వీటి సంఖ్య కూడా చాలా తక్కువే.వాటి క్వాలిటీ మాత్రం ఎక్కువగా ఉండటంతో డిమాండ్ హైరేంజ్లో ఉండేది.
ఇన్నోసెంటి లైసెన్స్ టెక్నాలజీ కూడా మన దేశంలో లాంబరెట్ట, విజయ సూపర్, అల్విన్ స్కూటర్లు పరిచయం చేసింది.
కంపెనీ ఏదైనా సరే స్కూటర్ అర్జెంటుగా కొనాలంటే కుదరక పోయేది.
వెస్పా 150ని బజాజ్ 150 పేరుతో తీసుకు వచ్చిన తర్వాత డిమాండ్ మరింత పెరగడంతో వీటిని బ్లాక్ మార్కెట్ లో కొనాలంటే ఆరు వేలకు పైగా వెచ్చించాల్సి వచ్చింది.అంటే ఆ మొత్తంతో అప్పట్లో అర ఎకరం భూమి వచ్చేది.
ఇక దీనిని బుక్ చేయడం మరొక పెద్ద సవాలుగా ఉండేది.కొనుగోలుదారులు మొదటగా అడ్వాన్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంటులో డబ్బు డిపాజిట్ చేసి ఆ బుక్ను నోటరీ ద్వారా హైదరాబాద్లో ఉండే ఒకే ఒక్క డిస్ట్రిబ్యూటర్ పేరిట ప్లేడ్జ్ చేసి పంపించాల్సి వచ్చేది.
ఆ తర్వాత చాలా రోజులకు స్కూటర్ డెలివరీ అయ్యేది.అదృష్టం ఉంటే స్కూటర్ రెండేళ్ల లోపే దొరికేది.
మిగతా వారికి మాత్రం ఆ లక్ కూడా ఉండక పోయేది.దాంతో వారు బ్లాక్ మార్కెట్లో స్కూటర్ కొనుగోలు చేయాల్సి వచ్చేది.