ఒడిశా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి.
వానల ధాటికి నదుల్లో ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తోంది.కుంటలు, చెరువులు అలుగు పారుతున్నాయి.
వాగులు, వంకల్లో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది.ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.
నదీ పరివాహక ప్రాంతాలు సహా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది.చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.
నీళ్లు ఇళ్లలోకి వచ్చాయి.దీంతో బంగ్లాలు ఉన్న వారు పై అంతస్తులకు వెళ్లిపోగా… చిన్న ఇల్లు ఉన్న వారు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే కొందరిని ప్రభుత్వ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.వారికి అక్కడ వసతి కల్పిస్తున్నారు.
వరద నీటితో పాటు బురద వస్తోంది.నీళ్లు పోయినా బురద పోదని… ఇంట్లో మొత్తం పేరుకుపోతుందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
ఒడిశా రాయగడలోని ఖైరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
అయితే.భారీ వరదల ధాటికి ఓ గున్న ఏనుగు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది.
నీటి వేగానికి అది కూడా కొట్టుకుపోయింది.ఏనుగు పిల్ల నీటిలో కొట్టుకుపోవడం చూసిన స్థానికులు.
ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.మరో వైపు, మల్కాన్ గిరి జిల్లాలో అనేక గ్రామాలు జలమయం అయ్యాయి.
ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు.