అనునిత్యం కొన్ని లక్షలమంది ప్రయాణికులను ఇండియన్ రెయిల్వే వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది.ప్రయాణికులకు వసతితో పాటు రక్షణతో కూడిన ప్రయాణాన్ని అందించడానికి రైల్వేస్ నిరంతరం పాటుపడతాయి.
ఈ క్రమంలోనే ప్రయాణ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రయాణికులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది.అవును, వారి భద్రత కోసం `ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ` అనే పేరుతో IRCTC ద్వారా ఇండియన్ రైల్వేస్ బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది.ఈ బీమా పాలసీలో భాగంగానే కేవలం 35 పైసలకే రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది.
ఈ బీమా సౌకర్యం అనేది దేశంలోని ఏ రైలులో ప్రయాణించే ప్రయాణికుడికైనా వర్తిస్తుందని గుర్తు పెట్టుకోవాలి.అయితే ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
అయితే ఈ బీమా విషయంలో కూడా కొన్ని నియమనిబంధనలు వున్నాయి.ఐదేండ్ల లోపు చిన్నారులు, విదేశీయులకు మాత్రం ఈ బీమా సౌకర్యం వర్తించదని గుర్తు పెట్టుకోవాలి.టికెట్ను బుక్ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఎంపిక చేసుకుంటేనే ఇది వర్తిస్తుంది… లేదంటే లేదు.
అలా ఎంపిక చేసుకున్నప్పుడు టికెట్ రిజర్వేషన్ కన్ఫర్మ్ కాగానే సంబంధిత ప్రయాణికుడి మొబైల్కు, ఈ-మెయిల్కు మెసేజ్ వస్తుంది.దీంతో పాటు నామినీ వివరాలను పొందుపరిచేందుకు ఓ లింక్ ను కూడా రైల్వే పంపుతుంది.అయితే ఇందులో క్యాన్సిలేషన్కు ఎలాంటి తావు ఉండదు.
PNR కింద బుక్ చేసుకున్న టికెట్ బుకింగ్స్కు బీమా వర్తిస్తుంది.ఇది కేవలం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారికే మాత్రమే వర్తిస్తుందని గుర్తు పెట్టుకోవాలి.
కౌంటర్ వద్ద టికెట్ తీసుకున్న వారికి వర్తించదు.
బెనిఫిట్స్:
ఈ బీమా తీసుకున్న తర్వాత ప్రయాణ సమయంలో ప్రయాణికుడు మరణించినా, శాశ్వత అంగ వైకల్యం కలిగినా రూ.10 లక్షల బీమా వస్తుంది.ఒక వేళ పాక్షికంగా అంగ వైకల్యం కలిగితే రూ.7.50 లక్షలు, గాయల పాలైతే ఆస్పత్రి ఖర్చులకు రూ.2 లక్షలు చెల్లిస్తారు.అలాగే ప్రమాద సమయంలో మరణించిన ప్రయాణికుడి మృతదేహాన్ని తరలించేందుకుగాను రూ.10 వేలు చెల్లిస్తారు.