టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.దేశంలో ఎక్కడా ఖైదీకి ఏసీ ఇచ్చిన దాఖలాలు లేవన్న ఆయన చంద్రబాబుకు మాత్రం ఇచ్చారని తెలిపారు.
కోర్టు చెప్పిన విధంగానే తమ ప్రభుత్వం నడుచుకుంటుందని మంత్రి అంబటి పేర్కొన్నారు.ఖైదీలకు ఏం ఇవ్వాలో, ఇవ్వకూడదో నిర్ణయించాల్సింది న్యాయస్థానమన్న సంగతి గుర్తు చేశారు.
ఈ క్రమంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు గతంలోనివేనని చెప్పారు.
ఇన్ని రోజులుగా కోర్టులో వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ఒక్కరోజైనా ఏసీ కావాలని అడిగారా అని ప్రశ్నించారు.చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు కలిసి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నేరం చేశారనడానికి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయన్న మంత్రి అంబటి తప్పు చేశారు కాబట్టే చంద్రబాబుపై చట్టం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ నేపథ్యంలో టీడీపీ తప్పుడు ప్రచారాలు చేయడం ఇకనైనా కట్టి పెట్టాలని వెల్లడించారు.