ఈ ప్రపంచంలో ప్రతి జీవి మనుగడకు ఆహారం ఎంత ముఖ్యమో తాగడానికి నీరు కూడా అంతే ముఖ్యం.తిండి లేకుండా కొన్ని రోజులు గడపవచ్చు కానీ నీరు లేకుండా మాత్రం జీవించడం అంటే కష్టమైన పనే అని చెప్పాలి.
నీటి కరువు ప్రభావిత ప్రాంతాలు ఇంకా మన దేశంలోనూ ఉన్నాయి.ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో చుక్క నీటి కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తారు.
ఈ క్రమంలోనే వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం, వరుణ యాగాలు చేయడం, గాడిదలకు పెళ్లిళ్లు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
ఎందుకంటే పంటలు పండాలంటే నీటి అవసరం చాలా ఉంటుంది.
కనీసం ఇలా పూజలు చేస్తే.వర్షాలు పడి భూమి తడుస్తుందేమో అన్న చిన్న ఆశ.అయితే కరువు ప్రాంతం అయిన అనంతపురం జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఒక విచిత్రం చోటు చేసుకుంది.ఈ ప్రాంతంలో భూమి నుంచి నీరు పైకి ఎగసి పడుతోంది.
దాదాపు అక్కడి రైతులు వెయ్యి నుంచి 1,500 అడుగుల బోర్లు వేసినా కానీ నీళ్లు పడక పంటలు సరిగా పండేవి కాదు.

కానీ ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా జలధారలు కనిపిస్తున్నాయి.అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు మండలం తుమ్మలకుంట్ల పల్లి మారమ్మ దేవాలయం వద్ద చేతి పంపులో మూడు నెలలుగా ఏకధాటిగా నీళ్లు బయటకు వస్తున్నాయి.ఇన్నేళ్ళుగా ఇప్పటివరకు ఇలాంటి దృశ్యం చూడ లేదని స్థానికులు చెబుతున్నారు.
ఎంతో కష్టపడి ఒక అరగంట పాటు బోర్ కొడితే గాని ఒక బిందె నిండేది అలాంటిది ఇప్పుడు బోరులో ధారాళంగా నీళ్లు వస్తున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పంటలు బాగా పండి సకాలంలో పంట చేతికి వస్తుందని అక్కడి స్థానికులు సంతోషిస్తున్నారు.!
.