2021వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రిప్పల్ ఆఫ్ హోప్ అవార్డ్ విజేతలను రాబర్ట్ ఎఫ్ కెనడీ హ్యూమన్ రైట్స్ గత గురువారం ప్రకటించింది.వారి వారి రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురిని ఈ అవార్డుకి ఎంపిక చేశారు.
వీరిలో ఒక భారత సంతతి ప్రముఖుడు కూడా వున్నారు.పర్సెప్షన్ కంపానియన్స్ ఇండియన్ అమెరికన్ మేనేజింగ్ డైరెక్టర్ దేవెన్ పరేఖ్, రచయిత అమండా గోర్మాన్, రాజకీయ వేత్త స్టాసీ అబ్రమ్స్, క్లియర్లేక్ కేపిటల్ సహ వ్యవస్ధాపకుడు జోస్ ఈ ఫెలిసియానో, వెరిజోన్ ఛైర్మన్ హన్స్ వెస్ట్బర్గ్లు అవార్డుకు ఎంపికైన వారిలో వున్నారు.
ఈ ఏడాది రిప్పల్ ఆఫ్ హోప్ అవార్డ్కు ఎంపికైన విజేతలు అమెరికా శ్రేయస్సు కోసం రాజీలేని కృషి చేశారని కమిటీ ప్రశంసించింది.
డిసెంబర్ 9 గురువారం జరిగే కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చేతుల మీదుగా ఈ ఐదుగురికి అవార్డులు ప్రధానం చేయనున్నారు.2021 రిప్పల్ ఆఫ్ హోప్ అవార్డు వేడుకలో స్టాసీ, హన్స్, జోస్, అమందా గోర్మాన్, దేవెన్లతో కమలా హారిస్ పాల్గొననుండటం తమకు గౌరవంగా వుందన్నారు రాబర్ట్ ఎఫ్ కెనడీ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు కెర్రీ కెన్నెడీ అన్నారు.1968 నుంచి రిప్పల్ ఆఫ్ హోప్ అవార్డులను బహుకరిస్తున్నారు.వ్యాపారం, ప్రభుత్వ వ్యవహారాలు, న్యాయ శాస్త్రం, వినోదం వంటి పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలను అందిస్తున్నారు.గతంలో బరాక్ ఒబామా, టిమ్ కుక్, డోలారస్ హ్యూర్టా, డెస్మంట్ టుటు, కోలిన్ కపెర్నిక్, హిల్లరీ క్లింటన్, జాన్ లూయిస్, బోనో, జో బైడెన్లు రిప్పల్ ఆఫ్ హోప్ అవార్డును అందుకున్నారు.
ఇక దేవెన్ పరేఖ్ 2016 నుంచి 2018 వరకు ఓవర్సీస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్ బోర్డులో పనిచేశారు.అంతకుముందు 2010 నుంచి 2012 వరకు యూనైటెడ్ స్టేట్స్ ఎగుమతి- దిగుమతి బ్యాంక్ సలహా బోర్డు సభ్యునిగా వ్యవహరించారు.
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్ నుంచి దేవన్ ఎకనామిక్స్లో ఆయన బీఎస్ పట్టా పొందారు.కాగా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు ప్రత్యర్దిగా ఉన్న డెమొక్రటిక్ పార్టీ నేత జో బిడెన్ కోసం పరేఖ్ వర్చుల్ ఫండ్ రైజర్కు హోస్ట్గా కూడా వ్యవహరించారు.
గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా పరేఖ్ ఫండర్ రైజర్గా పనిచేశారు.
1992 -2000 మధ్యకాలంలో బెరెన్సన్ మినెల్లా & కంపెనీలో ప్రిన్సిపాల్, వైస్ ప్రెసిడెంట్ పదవులతో సహా అనేక పదవులను నిర్వహించారు.1991 నుంచి 1992 వరకు బ్లాక్స్టోన్ గ్రూప్కు ఫైనాన్షియల్ అనలిస్ట్గానూ వ్యవహరించారు.ఇన్సైట్ పార్ట్నర్స్లో మేనేజింగ్ డైరెక్టర్గా ప్రపంచవ్యాప్తంగా అప్లికేషన్ సాఫ్ట్వేర్, డేటా, కన్జ్యూమర్ ఇంటర్నెట్ వ్యాపారాలలో పరేఖ్ పెట్టుబడులను నిర్వహిస్తున్నారు.యూరప్, ఇజ్రాయెల్, చైనా, ఇండియా, లాటిన్ అమెరికా, రష్యాలలో దేవెన్ పెట్టుబడులు పెట్టారు.