బ్రిటన్లో లాక్డౌన్ ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ.కోవిడ్ పోరాటంలో ఎంతో సాయపడిన నిబంధనలు ముఖ్యంగా మాస్క్లపై నిషేధం ఎత్తివేయకూడదని కోరారు భారతీయ సంతతి వైద్యుడు, బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్ చాంద్ నాగ్పాల్.
భారత్లో బయటపడిన డెల్టా వేరియెంట్ రకం బ్రిటన్లోనూ కేసుల పెరుగుదలకు కారణమవుతోందని ఆయన హెచ్చరించారు.
లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ బహిరంగ ప్రదేశాలు, జనం గుమిగూడేందుకు అవకాశం వున్న ప్రజా రవాణా, దుకాణాల వంటి చోట్ల ఖచ్చితంగా మాస్క్లు ధరించేలా నిబంధనలు విధించాలని చాంద్ కోరారు.
అలాగే ఆయా ప్రదేశాల్లో వెంటిలేషన్ బాగా వుండేలాగా.ప్రజలు సామాజిక దూరం పాటించడం వంటి చర్యలు జూలై 19 దాటిన తర్వాత కూడా పాటించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గడిచిన 18 నెలలుగా వ్యాక్సినేషన్, ప్రజల వ్యక్తిగత చర్యల కారణంగా కోవిడ్ను అదుపులో వుంచగలిగామని చాంద్ అన్నారు.ప్రభుత్వం ఈ క్లిష్టమైన దశలో ఈ కోవిడ్ మార్గదర్శకాలను ఉన్నపళంగా పక్కనపెట్టకూడదని ఆయన హెచ్చరించారు.
ప్రజల ఆరోగ్యం, హెల్త్ సర్వీస్పై పెరుగుతున్న ఒత్తిడి ప్రభావాన్ని మాత్రమే కాకుండా.భారీ నష్టాన్ని తగ్గించడంలో కోవిడ్ జాగ్రత్త చర్యలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
కాగా, గడిచిన వారం రోజుల్లో ఇంగ్లాండ్లో కేసుల శాతం 74 శాతం పెరిగిందని.అలాగే కోవిడ్ సోకి ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య గత వారంతో పోలిస్తే 55 శాతం పెరిగిందని బీఎంఏ వెల్లడించింది.కేసుల పెరుగుదలతో పోల్చితే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తగ్గుదల వున్నప్పటికీ.కొన్ని రోజులుగా ఈ సంఖ్యలు పెరుగుతున్నట్లుగా నాగ్పాల్ తెలిపారు.ఇదే సమయంలో గడిచిన నెల కంటే రెండు రెట్లు ఎక్కువగా కోవిడ్ రోగులు బెడ్లు, వెంటిలేటర్లపై వున్నారని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు జూలై 19కి ముందే లాక్డౌన్ ఆంక్షలను తొలగించే అంశం పరిశీలిస్తామని బ్రిటీష్ ప్రభుత్వం వెల్లడించింది.ప్రధాని బోరిస్ జాన్సన్ , కొత్త హెల్త్ సెక్రటరీ సాజిద్ జావిద్ ఇద్దరూ కూడా కొన్ని లాక్డౌన్ నిబంధనలు జూలై 19 తర్వాత ఉండవని సంకేతాలిచ్చారు.డెల్టా వేరియెంట్ వ్యాప్తి తీవ్రంగా వున్న ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రజలు ఒకొరినొకరు కలవడం వల్ల కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాబోయే రెండు వారాల వ్యవధిలో పూర్తి ఆంక్షల సడలింపు మంచిది కాదంటున్నారు.దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నప్పటికీ ప్రజలకు ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందలేదని నివేదికలు చెబుతున్నాయి.
మరోవైపు లాక్డౌన్ ఎత్తివేత తర్వాత కమ్యూనిటీ ట్రాన్స్మిషన్పై బీఎంఏ ఆందోళన చెందుతోంది.ఈ పరిణామం టీకాలను సైతం తట్టుకునే కొత్త వేరియెంట్ల పుట్టుకకు కారణమవుతుందని అసోసియేషన్ అభిప్రాయపడింది.