ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరులో ప్రభుత్వాలకు ప్రజలు కష్టనష్టాలకు ఓర్చి మరీ సహకరిస్తున్నారు.ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టినా, ఆకలి చావులు భయపెడుతున్నా కంటికి కనిపించని సూక్ష్మజీవిపై యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు.
ఈ క్రమంలో ప్రజల సంకల్పానికి ఆయా దేశాలు సైతం చప్పట్లు కొడుతున్నాయి.ఈ క్రమంలో వారికి రకరకాల మార్గాల్లో సంఘీభావం తెలియజేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజలకు సెల్యూట్ చేస్తున్న ఓ కెనడియన్ ఎయిర్ఫోర్స్ విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో ఓ పైలట్ మరణించారు.
ఈ దుర్ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.
కోవిడ్ 19 మహమ్మారిపై పోరాటంలో కెనడా ప్రజల సహకారాన్ని అభినందించడానికి బ్రిటీష్ కొలంబియాపై స్నో బర్డ్స్ టీమ్కు చెందిన ఏరోబేటిక్స్ టీమ్ విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమైంది.దీనిలో భాగంగా ఆదివారం కామ్లూప్స్ ఎయిర్పోర్ట్ నుంచి రెండు విమానాలు టేకాఫ్ అయ్యాయి.
అయితే గాల్లోకి లేచిన కొద్దిసేపటికే వాటిలో ఒక విమానం అదుపుతప్పి ఓ ఇంటిముందు కుప్పకూలింది.దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి.ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితుల్లో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.
ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు నేషనల్ డిఫెన్స్ కెనడియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రకటించింది.మృతురాలిని కెప్టెన్ జెన్నిఫర్ కేసీగా గుర్తించారు.ఈమె నోవాస్కోటియాలోని హాలిఫాక్స్కు చెందినవారు.2014లో డైరెక్ట్ ఎంట్రీ ఆఫీసర్గా కెనడియన్ సాయుధ బలగాల్లో చేరారు.దీనికి ముందు ఆమె రేడియో రిపోర్టర్, యాంకర్, నిర్మాతగా వ్యవహరించారు.