2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారని, బాబు తీసుకునే నిర్ణయాలు సొంత పార్టీ నేతలకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.అయితే చంద్రబాబు నాయుడు తీసుకునే ఆ నిర్ణయం కేవలం గుంటూరు జిల్లాకు మాత్రమే పరిమితమై ఉంటాయని మరో క్లారిటీ కూడా ఇస్తున్నారు… రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచిన గుంటూరు జిల్లాలో చంద్రబాబు తీసుకోబోయే ఆ నిర్ణయాలు ఏమిటి.?? ఎటువంటి సంచలనాలకు బాబు తెర తీస్తున్నారు.?? అనే వివరాల్లోకి వెళితే.
ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసుకుంటున్న క్రమంలో చంద్రబాబు గుంటూరు జిల్లాలో తీసుకోబోతున్న నిర్ణయం సాహసంతో కూడినదని అంటున్నారు పరిశీలకులు.అదేంటంటే అధికార తెలుగుదేశం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రమే బరిలోకి దించాలని భావిస్తోంది అయితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న మరి కొందరు ఎమ్మెల్యేలను మాత్రం పక్క పెట్టాలని చంద్రబాబు ఇప్పటికే బాబు నిర్ణయం తీసుకున్నారట…
అయితే చంద్రబాబు తప్పించనున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో ఈసారి తన సొంత సామాజిక వర్గం నుంచి ఒక్కరికి కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదని టాక్ వినిపిస్తోంది.గుంటూరు జిల్లాలో మొత్తం 17 సీట్లు ఉండగా గడిచిన ఎన్నికల్లో టిడిపి 12 సీట్లు సాధించింది.అయితే గత ఎన్నికల్లో గెలుపొందిన కొంత మంది ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదని బాబు తెగేసి చెప్పారట, ఆ సీట్లను కోల్పోయే వారిలో బాబు సామాజిక వర్గానికి చెందినవాళ్లు ఎక్కువగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇదిలాఉంటే ఆయా ఖాళీ అయిన స్థానాలలో బీసీలకు పెద్దపీట వేయాలని ఆలోచనతో బాబు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.అయితే ఇది ఎంతవరకు అమలవుతుందో కానీ ప్రస్తుతానికి ఈ వార్త మాత్రం గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది, బాబు సామాజికవర్గానికి చెందిన నాయకులను షేక్ చేస్తోంది.తమ వారసులను బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఉన్న సీట్లకు ఎసరు పెడితే ఎలా బాబు అంటూ సొంత సామాజికవర్గ నేతలు బాబు పై గుర్రుగా ఉన్నారట.ఇదిలా ఉంటే చంద్రబాబు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదని ఈ విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందని బాబు సన్నిహితులు గుంటూరు నేతలకు స్పష్టం చేశారట.
మరి చివరకు బాబు తమ వర్గం నేతలకే పెద్దపీట వేస్తారా లేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.