సత్యం- అహింసలనే ఆయుధాలుగా మలిచి….దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన… మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ నిజాన్ని నిర్భయంగా చెప్పడంలోనూ, తప్పు చేసిన వారిని విమర్శించడంలోనూ గాంధీజీ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.
పొరపాటు చేసినా సరే… నిర్మొహమాటంగా ఒప్పుకొనే తత్త్వం బాపూజీ సొంతం.ఈ విషయంలో ఆయన భార్య కూడా మినహాయింపు కాదని ఆయనే స్వయంగా ఓ సారి చెప్పారని 1929లో నవజీవన్ పత్రికలో గాంధీజీ రాసిన వ్యాసం సంక్షిప్తంగా.

‘రెండేళ్ల క్రితం.కస్తూర్భా తన దగ్గర రెండు వందల రూపాయలు అట్టిపెట్టుకుంది.కానుకల ద్వారా తనకి ఆ డబ్బు వచ్చింది.అయితే ఇలా ఓ వ్యక్తి డబ్బును దాచుకోవడం అనేది ఆశ్రమ నియమాలకు విరుద్ధం.ఈ విషయం తెలిసి కూడా తను అలా చేయడం నన్నెంతగానో బాధించింది.అయితే ఇంతకన్నా బాధించే విషయం ఏంటంటే తన వద్ద డబ్బు ఉన్న సంగతి నా దగ్గర దాచిపెట్టడం.
ఈ విషయం బయటపడటం కూడా కొంత విచిత్రంగా జరిగింది.ఓరోజు ఆశ్రమంలో దొంగలు పడ్డారు.
వారు సరాసరి కస్తూర్భా గదిలోకి వెళ్లారు.అక్కడ వాళ్లకేమీ దొరకలేదు.
కానీ నాకు మాత్రం కస్తూర్భా చేసిన పొరపాటు తెలిసిపోయింది.దీంతో వెంటనే ఆమెను మందలించాను.
తను కాస్త బాధ పడినా ఇంకెప్పుడూ ఇలా చేయనని నాతో చెప్పింది.

కానీ ఆ పొరపాటును పునరావృతం చేసి నా నమ్మకం సన్నగిల్లేలా చేసింది.అప్పుడు రెండొందల రూపాయలు అయితే ఇప్పుడు కేవలం నాలుగు రూపాయలే.తనకు తెలిసిన వారెవరో బహుమతి రూపంలో నాలుగు రూపాయలు ఇచ్చారు.
ఆ డబ్బులను ఆశ్రమ ఖర్చుల కోసం ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకుంది.దీనిని నేను దొంగతనంగానే భావిస్తాను.
గట్టిగా నిలదీసిన తర్వాత ఈ విషయం గురించి నాకు చెప్పింది.తప్పని తెలిసినా కూడా తనకున్న ఈ అలవాటును మార్చులేకపోయాను అంది.