అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో, ఉన్నత విద్య కోసం విదేశాలకు పయనమయ్యే యువకులు ఎంతో మంది ఉన్నారు.తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు విదేశాలలో స్థిరపడితే ఎంతో సంతోషపడతారు.
కాని, సాధారణ మధ్య తరగతి కుటుంబలో పుట్టి ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్లిన ఆ బిడ్డ ఇక ప్రాణాలతో లేడు అని తెలిస్తే ఆ తల్లి తండ్రుల అనుభవించే నరకం మాటల్లో చెప్పలేనిది.చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, పొలకల పంచాయితి, కొండకింద యల్లంపల్లె గ్రామానికి చెందిన సాయి రోహిత్(28) బీటెక్ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం 2016లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కి వెళ్ళాడు.
ప్రస్తుతం అక్కడే సాయి రోహిత్ పార్ట్ టైం జాబు చేసుకుంటున్నాడు.ఈ నేపధ్యంలోనే, గురువారం ఉదయం ఉద్యోగ నిర్వహణలో భాగంగా సాయి రోహిత్, మెల్బోర్న్ నుంచి వేరే ప్రాంతానికి కారులో ప్రయాణం చేస్తున్నాడు.
అయితే, గుల్బర్ వ్యాలి హైవెలోని సియోమోర్ ప్రాంతం మీదుగా వెళ్ళాల్సి వచ్చింది.
ఆ సమయంలో ఆ ప్రాతంలో మంచు విపరీతంగా ఉండటం వలన దారి కనిపించకపోవడంతో సాయి రోహిత్ ఒక చెట్టును డీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందారు.రోహిత్ తో పాటు కారులో ఎవరూ లేకపోవడంతో సాయి రోహిత్ ఆచూకి కోసం అక్కడకి చేరుకున్నవారు ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ఈ విషయాన్ని తెలుసుకున్న ఆస్ట్రేలియా లోని తెలుగు సంఘాలు అతని వివరాలు కనుక్కొని, అతని తల్లితండ్రులకు తెలియచేశారు.
ప్రస్తుతం సాయి రోహిత్ మృతదేహన్ని స్వగ్రామానికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇందుకుగాను సుమారు 14వేల ఆస్త్రేలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని, మృతదేహం స్వగ్రామానికి చేరుకోవటానికి 7 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.
బాధాకరమైన విషయం ఏమిటంటే, సాయి రోహిత్ తండ్రి మోహన్ నాయుడు 2017లో మృతి చెందారు, ఆ సంఘటన నుంచీ తేరుకునే లోగానే ఇలా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందటంతో రోహిత్ మాతృమూర్తి రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టిస్తోంది.