రైతాంగాన్ని సంక్షోభం లోకి నెట్టిన జగన్ ప్రభుత్వం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ అనేక కామెంట్స్ చేశారు.అనంతపురం జిల్లాలో రైతాంగాన్ని నట్టేట ముంచి సంక్షోభంలోకి నెట్టిన జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు .
మూడేళ్ళ వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభాన్ని అనుభవిస్తుందన్నారు.అనంతపురం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంట నష్టం పోయారని, ఏడాదికి ఒక రైతుకు ఏడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపు కుంటుందని ఆరోపించారు.
సంక్షేమ పథకాల పేరుతో కాలయాపన చేస్తూ అన్నదాతలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు.హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి సకాలంలో నీళ్లు ఇవ్వక, తుంగభద్ర కెనాల్కు సగంలోనే నీటిని నిలుపుదల చేసి పంటలు పండకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
జిల్లాలో ప్రతి రైతు లక్ష రూపాయల వరకు నష్టపోతే కేవలం ఏడాదికి 7 వేల రూపాయలు ఇస్తున్నారని, జిల్లా రైతులకు 90 కోట్ల రూపాయలు మాత్రం పరిహారంగా ప్రకటించి లక్షల రూపాయలు పత్రికా ప్రకటనలు ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.మూడేళ్ల కాలంలో రైతులకు పంట నష్టపరిహారం అందకుండా చేశారని జిల్లా మంత్రులు,, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉరవకొండ నియోజకవర్గంలో 50వేల ఎకరాల్లో బిందు తుంపర సేద్యం చేపట్టాలని గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయగా ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.పేరూరు , బీటీపీ డ్యామ్ లకు నీటిని తీసుకు వచ్చే కెనాల్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కళ్యాణదుర్గం , ఉరవకొండ రాయదుర్గం నియోజక వర్గాలకు తాగు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.