కాస్త ఆలస్యం అయినా, వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయం ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రహించగలిగారు.ఆ ఎఫెక్ట్ ఇప్పుడు బాగా కనిపిస్తోంది.గతంతో పోలిస్తే జనసేన రాజకీయ కార్యక్రమాలు చాలా ఊపందుకున్నాయి.ఎప్పుడూ లేనంత స్పీడ్ ను పవన్ చూపిస్తున్నారు.రాజకీయంగా తనకు ఎదురు లేకుండా, తాను ఎవరి చెప్పుచేతల్లో లేను అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు అలముకున్నాయి.వాటి నుంచి వారిని బయటపడేసేందుకు పవన్ రకరకాల మార్గాలను అన్వేషించారు.దానిలో భాగంగానే కేంద్ర అధికార పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.కానీ పెట్టుకున్న దగ్గర నుంచి బిజెపి వ్యవహారశైలి ఏ విధంగా ఉంది అనేది పవన్ తో పాటు, జనసేన నాయకులకు బాగా అర్థమైంది.పేరుకు బిజెపి జనసేన పార్టీల పొత్తు ఉన్నా, ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి బిజెపి ఒంటరిగానే ముందుకు వెళ్తోంది.
బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేనను కనీసం గుర్తించినట్లుగా వ్యవహరించడం ఇలా ఎన్నో కారణాలతో జనసేన కు , పవన్ కు ఎన్నో రకాలుగా అవమానాలు ఎదురయ్యాయి.సొంత పార్టీ నాయకుల నుంచి సైతం పవన్ నిర్ణయంపై వ్యతిరేకత కనిపించింది.
ఇలా చెప్పుకుంటే వెళ్తే ఏపీలో బీజేపీ జనసేన పార్టీ కాస్తో కూస్తో బలంగా ఉంది.పెద్ద ఎత్తున అభిమానుల అండదండలు ఉన్నాయి.అందుకే పవన్ ఒంటరి ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై ఒంటరిగా పోరాటం చేస్తూ ,జనాల్లో జనసేన పై సానుకూలత పెరిగే విధంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ కలిసి వచ్చినా, రాకపోయినా ఫర్వాలేదు అన్నట్లుగానే పవన్ వ్యావహారశైలి కనిపిస్తోంది.

అదేపనిగా ప్రజా సమస్యలపై పోరాడుతూ, బిజెపి తమతో కలిసి వచ్చినా, రాకపోయినా నష్టం లేదు అన్నట్లుగా ప్రస్తుతం జనసేన వ్యవహారం కనిపిస్తోంది.కొద్ది రోజుల క్రితం తిరుపతి లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి ఎన్నికలలో పోటీ చేస్తారు అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించినప్పటి నుంచి బీజేపీ విషయంలో జనసేన వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.ఇక ముందు ముందు కూడా ఏపీలో జనసేన ఒంటరిగానే బలం పెంచుకునే విషయంపై దృష్టి పెట్టినట్లు వ్యవహరిస్తోంది.
కొద్ది రోజులుగా ఏపీలో వివిధ అంశాలపై పవన్ చేస్తున్న పోరాటాల ద్వారా కాస్త ఊపు వచ్చింది అనే విషయాన్ని అంతా గ్రహించారు.