జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ నిర్ణయం పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అన్న రేంజ్ లో బీజేపీ పై మండిపడుతుంది.అయితే కేంద్ర నిర్ణయాన్ని ఆ పార్టీ కి చెందిన సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ చివరి రాజు హరిసింగ్ కుమారుడు కరణ్ సింగ్ సమర్ధించారు.
జమ్మూకాశ్మీర్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలను పూర్తి గా ఖండించాల్సిన పనిలేదని ఆయన అభిప్రాయపడ్డారు.కరణ్ సింగ్ గతంలో కేంద్ర మంత్రిగా గా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే.
కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిన ఆయన రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు.దేశ వ్యతిరేకత నెపంతో రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల నాయకులను అదుపులోకి తీసుకోవడం సరైనది కాదని,వెంటనే ఆ పార్టీ నాయకులను విడుదల చేయాలనీ కేంద్రాన్ని కోరారు.
అలాగే పార్లమెంటు ఆమోదం పొందిన పునర్విభజన బిల్లులోని లద్దాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రతిపాదనను సింగ్ ఆహ్వానించారు.
ఆర్టికల్ 35 ఏ రద్దుకు మద్దతు ఇస్తూనే.లింగ వివక్షను పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.జమ్ము, కశ్మీర్ మధ్య రాజకీయ అధికారాలను పునర్విభజన బిల్లు సరైన రీతిలో విభజిస్తుందన్నారు.
ఇటీవల కేంద్రం పార్లమెంట్ లో ఈ నిర్ణయం తీసుకొనే ముందు జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం కోసం అక్కడ ప్రధాన పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసిన విషయం విదితమే.అంతేకాకుండా ఆ రాష్ట్రంలో భారీ గా బలగాలను దింపి భద్రతను కట్టుదిట్టం చేశారు.