ఇటీవల కాలంలో ఏపీ అధికార పార్టీ వైసీపీకి దెబ్బలు తగులుతున్నాయి.రాజకీయంగా ప్రతిపక్షాలు బలోపేతం అవుతూ అన్ని విషయాల్లోనూ తమను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుండడం, అదే సమయంలో పార్టీలోనూ గ్రూపు రాజకీయాలు, అసంతృప్తులు పెరిగిపోవడం వంటివి జగన్ ఆందోళన కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా పార్టీలో కీలక నాయకులుగా ఉన్నవారు అనేక విషయాలపై అసంతృప్తికి గురవుతూ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, మరోవైపు చూస్తే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఈ పరిణామాలన్నీ మరింత ఆందోళన పెంచుతున్నాయి.ఇక మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy ) వ్యవహారం వైసీపీలో కలవరం పుట్టిస్తుంది .
రీజినల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేయడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.జగన్ బంధువు, పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన బాలినేని రెండో విడత మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యారు అప్పటి నుంచి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు.
అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు బాలినేని ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు.అలాగే జగన్ ( YS Jagan Mohan Reddy )సైతం క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని బాలినేనిని బుజ్జగించడంతో ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు.ఆ తర్వాత ఆయనకు రీజనల్ కోఆర్డినేటర్ పదవులను అప్పగించారు.అయితే ఇటీవల జగన్ సభలో ప్రోటోకాల్ అంశంలో బాలనేని అసంతృప్తికి గురయ్యారట.ఇక అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.అయితే బాలనేని మాత్రమే కాకుండా , వైసిపి సీనియర్ నేతలు చాలామంది పార్టీ పదవుల విషయంలో అసంతృప్తితోనే ఉన్నారట.
ప్రస్తుతం 12 మంది రీజినల్ కోఆర్డినేటర్లలో ఇద్దరు మంత్రులు ఉంటే, మిగిలిన వారు ఎంపీ ఎమ్మెల్యేలే.దీంతో చాలామంది రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలకు న్యాయం చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.రీజనల్ కోఆర్డినేటర్ల గాను, జిల్లా అధ్యక్షులుగాను పనితీరు సరిగా లేకపోవడంతో గతంలోనే కొంతమందిని జగన్ తప్పించారు.వారిలో కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) వంటి వారిని సైతం పక్కన పెట్టారు.
పనిచేసే వారికి మాత్రమే పార్టీ పదవులనే సంకేతాలు ఇచ్చారు.
అయితే ఇప్పటికీ ఆ పదవులు విషయంలో బాధ్యతలు చూస్తున్న నాయకుల్లో మార్పు రాలేదట. జిల్లా కోఆర్డినేటర్లు అంటే, ఎప్పటికప్పుడు తమ పరిధిలోని జిల్లాలో పర్యటిస్తూ, నాయకులు మధ్య సమన్వయం చేస్తూ గ్రూప్ రాజకీయాలు లేకుండా చూసుకోవడంతో పాటు, పార్టీని బలోపేతం చేసే విధంగా వ్యవహరించాలి.అయితే ఇదంతా తలకు మించిన భారంగా భావిస్తున్న ఆ పదవుల్లోని వారు, ఆ బాధ్యతల్లో అంత యాక్టివ్ గా ఉండడం లేదట.
మరోవైపు చూస్తే ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో పరిస్థితులను చక్కదిద్దుకోవాల్సి ఉండడంతో ఈ పదవులపై అంత ఆసక్తి చూపించడం లేదట.ఇప్పటికే చాలామంది ఆ పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారట.
ఈ పరిణామాలన్నీ వైసిపి అధిష్టానానికి ఆందోళన కలిగిస్తున్నాయట.