నిన్న మొన్నటి వరకూ జనాలను ఆయిల్ రేట్స్ ఏ విధంగా బాధించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఇప్పుడు కూడా పెద్దగా ఆయా రేట్స్ నుండి పెద్దగా ఉపశమనం లేదుగాని గుడ్డిలో మెల్ల మాదిరి కాస్త బెటర్ అని చెప్పుకోవాలి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది.అవును, సామాన్యులకు ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవాలి.
వంట నూనె, కంది పప్పు, మినుములులకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేసింది.
కంది పప్పు, మినుములు, ఆయిల్ ఉచిత దిగుమతులను పొడిగిస్తున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది.
మరో సంవత్సరం పాటు అంటే 2024 మార్చి 31 వరకు ఈ ఉచిత దిగుమతులు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ఈ సందర్భంగా DGFT (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) తాజాగా తన నోటిఫికేషన్లో వెల్లడించింది.
అయితే రిఫైన్డ్ ఆయిల్స్ దిగుమతులను మాత్రం కేరళలోని పోర్టుల నుంచి చేయకూడదనే ఆంక్షలను మాత్రం అలాగే కొనసాగించడం కొసమెరుపు.
ఈ నేపథ్యంలో దీని వల్ల ధరలు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది.కంది పప్పు ధర ప్రస్తుతం మార్కెట్లో కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగా వున్న విషయం విదితమే.లాథూర్ హోల్ సేల్ మార్కెట్లో క్వింటాల్కు రూ.6,800 వద్ద కొనసాగుతోంది.అయితే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.6,600గా ఉండటం గమనార్హం.ఇక వంట నూనె ధరలు ప్రస్తుతం అదుపులోనే ఉన్నప్పటికీ మరింత తగ్గే అవకాశం వుంది.ప్రస్తుతం పామ్ ఆయిల్ రేటు కేజీకి రూ.104 వద్ద కొనసాగుతోంది.కాగా ఈ ఏడాది ఆరంభంలో వంట నూన ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే.