వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లినప్పటికీ… భారతీయులు మూలాల్ని మరిచిపోరు.ఏ స్థాయికి చేరుకున్నా తాము ఎక్కడి నుంచి వచ్చింది గుర్తుంచుకుంటారు.
ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది.తాజాగా అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్రంలోని సెవెంత్ జ్యుడీషియల్ సర్క్యూట్ కోర్టుకు ఫుల్టైమ్ మేజిస్ట్రేట్గా నియమితులయ్యారు భారత సంతతికి చెందిన జానకీ శర్మ.
హిందువుల ఇతిహాస గ్రంథం రామాయణంపై ప్రమాణ స్వీకారం చేసి భారతదేశంపైనా, హిందూ మతంపైనా తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు .ఆమె కుటుంబ మూలాలు గుజరాత్లోనే వున్నాయనే విషయం చాలా మందికి తెలియదు.
వాస్తవానికి ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన జానకీ కుటుంబం.ఆమె తండ్రి, తల్లి, ఇద్దరు సోదరులతో సహా 1995లో అహ్మదాబాద్కు మకాం మార్చింది.జానకీ 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు.2001లో ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.అయితే జానకీ కుటుంబం మాత్రం ఇంకా అహ్మదాబాద్లోనే వుంది.
డోన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ మేనేజ్మెంట్.యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా కాలేజ్ ఆఫ్ లా నుంచి లా డిగ్రీని అందుకున్నారామె.జానకీ శర్మ 2017 నుంచి పెన్నింగ్టన్ కౌంటీ పబ్లిక్ డిఫెండర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు.
అంతకుముందు మేజిస్ట్రేట్కు టర్మ్ లా క్లర్క్గా విధులు నిర్వర్తించారు.ప్రస్తుతం సౌత్ డకోటాలోని ర్యాపిడ్ సిటీలో నివసిస్తున్నారు జానకీ శర్మ.
పెద్ద సోదరుడు భువన్ భార్య డెలివరీ సందర్భంగా ఆమె చివరి సారిగా 2021 అక్టోబర్లో అహ్మదాబాద్కు వచ్చారు.అన్నట్లు జానకీ శర్మ ప్రమాణ స్వీకారం చేసిన రామాయణ గ్రంథాన్ని తీసుకొచ్చింది భువన్ కావడం గమనార్హం.