ఇటీవల ఒంటికాలిపై బడికెళ్తున్న బీహార్కు చెందిన 10 ఏళ్ల బాలిక వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆమెకు దాతలు ముందుకొచ్చి కృత్రిమ కాలు కూడా అమర్చారు.
అయితే ఇపుడు తాజాగా ప్రతిరోజూ ఒంటికాలిపై 2 కిలోమీటర్ల దూరం గెంతుకుంటూ స్కూల్కు వెళ్తున్న జమ్ముకశ్మీర్ బాలుడి వీడియోఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.ఇక స్కూల్ యూనిఫాంలో ఒంటికాలిపై వెళ్తున్న బాలుడిని చూసి నెటిజన్లు చాలా ఎమోషనల్ అవుతున్నారు.
అతడు చిన్నతనంలోనే తన కాలుని పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, జమ్ముకశ్మీర్లోని హంద్వారాకు చెందిన 14 ఏళ్ల పర్వేజ్ నౌగామ్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
చిన్నతనంలోనే అతడు ఓ భారీ అగ్నిప్రమాదంలో తన కాలుని కోల్పోయాడు.అయినా అతగాడు నిరుత్సాహపడలేదు.ప్రతిరోజూ ఒంటికాలిపైనే గెంతుతూ స్కూల్కు వెళ్తున్నాడు.సాంఘిక సంక్షేమ శాఖ అతడికి వీల్చైర్ ఇచ్చినా, ఆ గ్రామంలో రోడ్లు బాగాలేకపోవడంతో ఒంటికాలిపై గెంతుతూ స్కూల్కు వెళ్లాల్సిన పరిస్థితి.
కాగా, అతగాడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.ప్రతిరోజూ 2 కిలోమీటర్ల దూరం గెంతుతూనే వెళ్తానని, స్కూల్కు చేరుకునే సరికి చెమటలు పడతాయని తెలిపాడు.
ఈ సందర్భంగా అనేక విషయాలు అతడు మీడియాతో పంచుకున్నాడు.తనకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ అంటే చాలా ఇష్టమని అన్నాడు.కృత్రిమ కాలు పెట్టించేంత స్థోమత తన తండ్రికి లేదని, ప్రభుత్వం దయతలచి తనకు సాయంచేస్తే మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదుగుతానని అంటున్నాడు.ఈ వీడియో వైరల్ కావడంతో జైపూర్ ఫుట్ యూఎస్ఏ చైర్మన్ ప్రేమ్ భండారీ స్పందించారు.
పర్వేజ్కు ఉచిత కృత్రిమ అవయవాన్ని అమర్చుతామని మాటిచ్చారు.దాంతో పర్వేజ్ వారికి ధన్యవాదాలు తెలియజేసాడు.
స్థానికులు కూడా ఈ విషయమై ఎంతో సంతోషాన్ని తెలియజేశారు.