వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.భారత సంతతి క్రమంగా పెరగడంతో మనవాళ్లు అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .
ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే ఈ గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.
ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్, నార్త్ కరోలినా తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.
అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెగ తపిస్తుంటారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు- 2020లో భారతీయుల హవా స్పష్టంగా కనిపించింది.
ఒక్క అమెరికాలోనే కాదు.బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా ఇలా చాలా దేశాల్లో కింగ్ మేకర్లుగా ప్రవాసులు వున్నారు.
మరికొద్దిరోజుల్లో ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయులు తమ స్టామినా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో మనవారిని ప్రసన్నం చేసుకునేందుకు అక్కడి రాజకీయ పార్టీలు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి.
మే 21న జరగనున్న ఫెడరల్ ఎన్నికలపై ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు.భారత్తో ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా – వాణిజ్య ఒప్పందాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీకి ఇష్టమైన ‘‘కిచిడీ’’ని చేశారు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ .ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.బాగా వైరల్ అయ్యాయి.
ఎన్నికలకు పిలుపునిచ్చిన ఒక రోజు ముందు ఈ చిత్రాన్ని పోస్ట్ చేసిన మోరిసన్.ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్కి చెందిన వంటలు వండుతున్నానని చెప్పారు.
ఆయనే కాదు.లేబర్ పార్టీకి చెందిన ఆంథోనీ అల్బనీస్ ఒక దేవాలయంలో కనిపించడం చర్చనీయాంశమైంది.
మరో లేబర్ పార్టీ నేత ఆండ్రూ చార్ల్టన్ కూడా సిడ్నీలోని శ్రీ స్వామి నారాయణ మందిరానికి వెళ్లి భారతీయ సంతతికి చెందిన భక్తులతో ముచ్చట్లు పెట్టాడు.లేబర్ పార్టీలో ఎదుగుతున్న చైనీస్ సంతతి అభ్యర్ధులపై గతంలో దృష్టి సారించిన ఆస్ట్రేలియా మీడియా ఇప్పుడు భారత సంతతికి చెందిన ఓటర్లు, అభ్యర్ధులపై ఫోకస్ పెట్టింది.
ఇకపోతే.భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ల సంఖ్య 2010లో 3.80 లక్షలు వుండగా.2020 నాటికి ఎనిమిది లక్షలకు చేరుకుంది.యూఎస్లో మాదిరిగానే కొన్ని నియోజకవర్గాల్లో భారతీయ ఆస్ట్రేలియన్లు నిర్ణయాత్మక శక్తిగా వున్నారు.ఇప్పటికే పశ్చిమ సిడ్నీలోని హారిస్ పార్క్ను స్థానికులు లిటిల్ ఇండియాగా వ్యవహరిస్తారు.