ఓ రైతు చేసిన పనికి వ్యవసాయశాఖ అధికారులు షాక్ అయ్యారు.వ్యవసాయం గిట్టుబాటు కాలేదో లేక పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదన్న కారణమో తెలియదు కానీ, ఓ రైతు తను పండించిన పంటలో బియ్యం కలుపుకుని వచ్చాడు.
అనుమానం వచ్చిన వ్యాపారి గోనె సంచులను తెరిస్తే అసలు విషయం బయటపడింది.ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.కారేపల్లి మండలానికి చెందిన ఓ రైతు తాను పండించిన పత్తి పంటను 35 బస్తాల్లో వేసుకుని కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకి తీసుకువచ్చాడు.
పంట రేటును పత్తి నాణ్యత బట్టి నిర్ణయిస్తారు.ఇంత వరకు బాగానే ఉన్నా.
పత్తి బస్తాలను కాటాపై ఉంచితే ఎక్కువ బరువు తూగాయి.దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి… వాటిని తనిఖీ చేయమని తన గుమస్తాకు చెప్పాడు.
వెంటనే అతను కత్తెరతో గోనె సంచులను కత్తిరించి పరిశీలించాడు.పత్తితో పాటు రేషన్ బియ్యం గోనె సంచుల్లో ఉండడంతో అక్కడ ఉన్నవారంతా అది చూసి షాక్ అయ్యారు.
ప్రతి బస్తాలోనూ 3 నుంచి 5 కేజీల వరకు బియ్యం వేసుకుని పత్తిని తీసుకొచ్చాడు సదరు రైతు.ఇలాంటి పనులు చేయడం రైతులకు మంచిదికాదని.
గిట్టుబాటు ధర కోసం పోరాడాలని అధికారులు సూచించారు.
ఈ ఘటన బట్టి మనకు ఓ విషయం అర్ధమవుతోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.సకాలంలో వర్షాలు పడి విత్తనాలు వేస్తే.
చివరికి ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియని పరిస్థితి.మరోపక్క పురుగు మందులు, కూలీల ఖర్చులు ఏటేటా పెరిగి రైతులకు భారంగా మారుతున్నాయి.
ఒక వేళా వర్షాలు బాగా పడి పంట దిగుబడి పెరిగినా గిట్టుబాటు ధర వస్తుందన్న గ్యారెంటీ లేదు.దీంతో చేసిన అప్పులు తీర్చడానికి రైతులు ఇలాంటి పనులు చేయాల్సి రావడం నిజంగా బాధాకరం.