ముఖ్యమంత్రిగా అన్ని బాధ్యతలు, అన్ని కీలక నిర్ణయాలు ఒక్కరే ఆలోచించి, ఒక్కరే తీసుకోవడం అనేది చాలా ఇబ్బంది తో కూడుకున్న పని.అందుకే ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు మేలు చేసేందుకు ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అనే విషయాన్ని ఆలోచించి, చర్చించేందుకు ప్రభుత్వం కొంత మంది సలహాదారులను నియమించుకుంటూ ఉంటుంది.
పరిపాలన సౌలభ్యం కొరకు, వివిధ అంశాల్లో నిష్ణాతులైన వారిని సలహాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మేలు జరుగుతుంది అనేది ప్రధాన ఉద్దేశ్యం.అయితే ఏపీలో ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో ఉన్న సలహాదారులపై విమర్శలు, వివాదాలు ఏర్పడుతున్నాయి.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిని సలహాదారులుగా నియమించుకున్నారు.వీరిలో ఎక్కువగా జగన్ సామాజిక వర్గానికి చెందినవారే ఉండటం, వారు ప్రభుత్వ సలహాదారు లుగానే ఉంటూనే రాజకీయ అంశాలపై ఎక్కువగా మాట్లాడుతూ, మీడియా ముందు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ ఉండడం, ఇలా అనేక కారణాలతో ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళింది.
కేవలం రాజకీయంగాను, ఆర్ధికంగాను తమ వర్గం వారికి మేలు చేకూర్చాలని జగన్ లెక్కకు మిక్కిలిగా సలహాదారులను నియమిస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
భారీ ఎత్తున జీతం, ఇతర అలవెన్సుల పేరుతో సలహాదారులకు ప్రతినెల కోట్లాది రూపాయలు సొమ్ములు ఖర్చుపెట్టడం వంటి వ్యవహారాలపై తాజాగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
అసలు సలహాదారులకు ఇస్తున్న సౌకర్యాలు కనీసం హైకోర్టు న్యాయమూర్తులకు కూడా లేవంటూ కోర్టు అభిప్రాయపడింది.అసలు సలహాదారుల పేరుతో దాదాపు 50 , 60 మందిని నియమించడాన్ని కోర్టు తప్పు పడుతోంది .ప్రస్తుతం ఏపీ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇంత మంది సలహాదారులు అవసరమా అంటూ వ్యాఖ్యానించింది.
మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ని ఎన్నికల కమిషనర్ గా నియమించడాన్ని సవాల్ చేస్తూ విజయనగరం జిల్లా సాలూరు కు చెందిన న్యాయవాది మహేశ్వరరావు హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈ విధంగా అభిప్రాయపడింది.ఒకవైపు ఏపీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, సంక్షేమ పథకాలకు కోట్లరూపాయలు వెచ్చించడం, ప్రతినెల ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవడం, కోర్టు నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండడం, ప్రజల్లోనూ సలహాదారుల విషయమై పెద్ద చర్చ జరుగుతోంది.కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యక్తులను మాత్రమే సలహాదారులుగా ఉంచుకుని, మిగతా వారిని తప్పించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.