సోషల్ మీడియా.సరదాలు, సంతోషాలు, వ్యక్తిగత విషయాలను నలుగురితో పంచుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ మాధ్యమాలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే పవర్ఫుల్.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేది ఈ సోషల్ ఫ్లాట్ఫామ్సే.ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా, దించేయాలన్నా, ఒక్క ట్వీట్తో ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయాలన్నా అంతా సామాజిక మాధ్యమాల చేతుల్లోనే వుంది.
కత్తికి రెండు వైపులా పదును వున్నట్లుగానే.ఈ సోషల్ మీడియాను మంచికి ఉపయోగిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.
అదే తప్పుడు పనులకు వాడితే దీని వల్లే జరిగే కీడు ఊహాకు కూడా అందదు.అందుకే ఎన్నో దేశాలు ఈ సోషల్ మీడియాను నియంత్రించాలని భావిస్తున్నాయి.
ఇటీవల భారత్లోనూ కొత్త ఐటీ పాలసీ వచ్చిన సంగతి తెలిసిందే.దీనిపై ట్విట్టర్ కాస్త మొండికేయడం, కేంద్రం వార్నింగ్ ఇవ్వడంతో ట్విట్టర్ పిట్ట దారిలోకి వచ్చింది.
ఇక అసలు విషయంలోకి వెళితే.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సోషల్ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశాన్ని కరోనా ఫ్రీ చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్న ఆయన ప్రయత్నాలకు సామాజిక మాధ్యమాలు తీవ్ర అవరోధాలుగా మారాయి.ప్రస్తుత పరిస్ధితుల్లో వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రజలను వైరస్ బారి నుంచి రక్షించగలదని భావించారు బైడెన్.
దీనిలో భాగంగా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తొలి 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయంతో.మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని అందుకున్నారు.దీంతో బైడెన్ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు.
దాన్ని కూడా 10 రోజుల ముందే.అంటే 90 రోజుల్లోనే ఛేదించారు.
ఫలితంగా.ఒకప్పుడు రోజుకు 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో వణికిపోయిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది.కానీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, జూలై 4 నాటికి దేశాన్ని కరోనా ఫ్రీగా చేయాలని బైడెన్ లక్ష్యంగా పెట్టుకుని శ్రమించారు.
కానీ ఇంకా అమెరికాలో వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు మిలియన్ల మంది వున్నారు.వీరిలో కనీసం సింగిల్ డోసు కూడా తీసుకోని వారు వున్నారు.అయితే సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారంతో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్నారు.ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ.ప్రజల్లో మార్పు రాకపోవడంతో దీనికి కారణమైన సోషల్ మీడియాపై బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైట్హౌస్లో శుక్రవారం జరిగిన మీడియ సమావేశంలో మాట్లాడిన ఆయన.సామాజిక మాధ్యమాలు అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని వ్యాఖ్యానించారు.ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని బైడెన్ హెచ్చరించారు.
అంతేగాక వ్యాక్సిన్ వేసుకోనివారిలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోందని గుర్తు చేశారు.కనుక సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదన్నారు.