తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఈటెల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ లో ఉప ఎన్నికల పోరు అనివార్యం కాబోతోంది.
దీనికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకపోయినా, ఇప్పటి నుంచే అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ ప్రచార కార్యక్రమానికి తెర తీశాయి.రాజేందర్ కు గట్టిపట్టు ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయనను రాజకీయంగా ఎలా దెబ్బ కొట్టాలనే విషయంపైనే టిఆర్ఎస్ ఫోకస్ పెట్టింది.
అందుకే హుజురాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థిగా బలమైన నేతనే పోటీకి దింపాలనేది కెసిఆర్ ఆలోచన.ఇప్పటికే అనేక మంది పేర్లు తెరపైకి వచ్చినా, ఎవరి పేరు ఫైనల్ అవుతుంది అనేది క్లారిటీ లేకుండా పోయింది.
ఆ పేరు కెసిఆర్ ప్రకటించే వరకు ఉత్కంఠ కలిగిస్తూనే ఉంటుంది.ఈ నేపథ్యంలోనే రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.తాజాగా కరీంనగర్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు సంజీవరెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది.మహారాష్ట్ర మాజీ గవర్నర్ ప్రధాన అనుచరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.
అలాగే రెండు రోజుల క్రితం మంత్రి హరీష్ రావు సమక్షంలో ఆయన టిఆర్ఎస్ లో చేరడంతో ఆయనే హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి అనే ప్రచారం మొదలైంది.అదీకాకుండా టిఆర్ఎస్ లో చేరే ముందే ట్రస్మా ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి టిక్కెట్ హామీ డిమాండ్ నూ టిఆర్ఎస్ పెద్దలు వద్ద పెట్టినట్లు తెలుస్తోంది.
స్పష్టమైన హామీ రావడంతోనే సంజీవరెడ్డి టిఆర్ఎస్ లో చేరినట్లు సమాచారం.అయితే ఇప్పటికీ కేసీఆర్ రకరకాల మార్గాల ద్వారా టిఆర్ఎస్ కు హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎంత పట్టు ఉంది అనే విషయం సర్వేల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే నిఘా వర్గాల ద్వారా టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని నిలబడితే కలిసి వస్తుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.