కోవిడ్ సెకండ్ వేవ్తో అల్లాడిపోతున్న భారతదేశాన్ని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొస్తూనే వున్నారు.వ్యక్తిగత సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో జన్మభూమికి అండగా నిలబడుతున్నారు.
ప్రధానంగా దేశాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, ఇతర వైద్య పరికరాలను విరాళంగా అందజేస్తున్నారు.ఈ నేపథ్యంలో అమెరికాలోని దక్షిణ కాలఫోర్నియాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన సంస్థలు, వ్యాపార యజమానులు పెద్ద ఎత్తున నిధులను సేకరిస్తున్నారు.
దక్షిణ కాలిఫోర్నియాలోని హాస్పిటాలిటీ పరిశ్రమలో భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో పాటు ఉపాధి పొందుతున్నారు.
లాస్ ఏంజిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రిన్స్ ఆర్గనైజేషన్ సీఈవో సునీల్ తోలాని మాట్లాడుతూ.
తమ ఫ్రాంచైజ్లో భాగస్వాములైన హిల్టన్ వరల్డ్ వైడ్, మారియట్ ఇంటర్నేషనల్, ఛాయిస్ హోటల్స్, రమడా హోటల్స్, హాలిడే ఇన్, హయత్ వంటి వివిధ సంస్థల ద్వారా భారత్లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలకు నిధులు సమకూరుస్తామని చెప్పారు.సిక్కు గురుద్వారాలు, హిందూ దేవాలయాలు, చర్చిల వంటి మత సంస్థల ద్వారా కూడా నిధులు సేకరిస్తున్నట్లు సునీల్ వెల్లడించారు.
అలాగే తమ రెస్టారెంట్లో వారం పాటు జరిగే అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని భారత్ కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆరెంజ్ కౌంటీలోని ఆద్య రెస్టారెంట్ సహ యజమానులు షాచి మెహ్రా, సందీప్ బస్రూర్ తెలిపారు.
కాగా, మే 10 నుంచి మే 16 మధ్యకాలంలో భారత్లో సహాయక చర్యలకు మద్ధతుగా ఆద్య బృందం 29,100 డాలర్లు సేకరించింది.గతేడాది అమెరికాలో కోవిడ్ కారణంగా తమ వ్యాపారాలు మూతపడ్డాయని మెహ్రా తెలిపారు.అయితే తర్వాత పరిస్ధితులు కుదుటపడటంతో రెస్టారెంట్ తిరిగి గాడినపడిందన్నారు.
ఇకపోతే లాస్ఏంజిల్స్లోని భారత సంతతి వైద్యులు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కొనుగోలు చేసేందుకు నిధులను సేకరిస్తున్నారు.దక్షిణ కాలిఫోర్నియాలోని భారతీయ సమాజం విజ్ఞప్తితో తమ ప్రయత్నాలకు మంచి స్పందన వస్తోందన్నారు అసోసియేషన్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ( ఏఎల్ఏపీఐఓ) వ్యవస్థాపకుడు డాక్టర్ భారత్ పటేల్.
తాము 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కొనుగోలు చేశామని వాటిని కొద్దిరోజుల్లోనే ఢిల్లీ, వడోదరాలకు పంపుతామన్నారు.జాయ్ ఆఫ్ షేరింగ్, సర్వమంగళ్ల ట్రస్ట్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో పంపిణీ చేస్తామని పటేల్ వెల్లడించారు.