కరోనా విలయ తాండవానికి దేశమంతా అల్లాడుతోంది.ఈ సమయంలో లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గమని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నా, కేంద్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు.
దీనికి కారణం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తే తలెత్తే పరిణామాలు అన్నిటికీ కేంద్రమే బాధ్యత వహించాలని, రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించడమే కాకుండా, అన్ని పర్యవసానాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, అన్ని రాష్ట్రాలు తమపై నిందలు రాకుండా, కేంద్రం పైకి మళ్ళించి రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తాయి అని, ఇలా ఎన్నో కారణాలతో పూర్తిగా రాష్ట్రాలకి ఆ బాధ్యతలను వదిలివేసింది.కేవలం సూచనలు ఇవ్వడం, రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవడం వంటి విషయాలు తప్పించి, మిగతా అన్ని విషయాలలోను కేంద్రం చేతులెత్తేసింది.
దీంతో ఆయా రాష్ట్రాలే సొంతంగా లాక్ డౌన్ తో పాటు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలకు దిగుతున్నారు.అయితే కేంద్రం నిర్ణయం కొన్ని రాష్ట్రాలకు అనుకూలంగా మారగా, కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
గత ఏడాది దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేసిన సమయంలో, ఏపీ పరిస్థితి మిగతా రాష్ట్రాల కంటే బెటర్ గా ఉంది. కరోనా కట్టడికి జగన్ పూర్తి చర్యలు తీసుకున్నారు.
కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో కానీ , కోవిడ్ సెంటర్లను నిర్వహించడం, కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకున్న ముందు జాగ్రత్తలు , ఇలా ఎన్నో అంశాలు దేశవ్యాప్తంగా జగన్ ప్రతిష్టను మరింత పెంచాయి.కానీ ఇప్పుడు మాత్రం జగన్ వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలు అవుతోంది.
కరోనా కట్టడికి కేవలం మీటింగులు పెట్టి అధికారులకు సూచనలు చేయడం వరకు చేస్తున్నారు తప్ప, ఈ వైరస్ ని అడ్డుకునే విధంగా కార్యాచరణ మాత్రం రూపొందించ లేకపోతున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా, జనాలు గుంపులుగా రోడ్ల మీదకు వస్తున్నారు.వైన్ షాపులు వద్ద రద్దీ అలాగే ఉంది.షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ ఉన్నట్లుగా కనిపించడం లేదు.
వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనూ గుంపులు గుపులుగా జనాలు ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇక ఆక్సిజన్ కొరతతో పాటు, బెడ్స్, వెంటిలేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.
ఇటువంటి కీలకమైన సమయం లోనూ జగన్ సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు.వాటికి నిధులు విడుదల చేస్తూ, కరోనా కట్టడి విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
దీనికి తోడు పత్రికల్లో ప్రభుత్వ ప్రకటన రూపంలో కోట్లాది సొమ్ము ఖర్చు పెడుతున్నారని, ఈ కరోనా సమయంలో ఇది అవసరమా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగానే ఉంది అధికారులు నాయకులు కరోనా విషయంలో ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.
మొదటి విడతలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జగన్ రెండో విడత కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆ స్థాయిలో స్పందించకపోవడంతో జగన్ విమర్శలు మూట గట్టుకోవాల్సి వస్తోంది.